తెలంగాణ: కోదండరామ్కు సోనియా పిలుపు?
కోదండరామ్కు వచ్చిన పిలుపు రాష్ట్ర విభజనపై అంతిమ నిర్ణయం తీసుకునేందుకే కావచ్చునని అంటున్నారు. ఇప్పటికే వివిధ నేతల అభిప్రాయాలు సేకరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా కూడా ఈ అంశంలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే సకల తెలంగాణ పోరాట సంఘాల విస్తృస్థాయి వేదికగా ఉన్న తెలంగాణ జెఎసి నాయకత్వంతో చర్చలు జరిపేందుకు ఆమె అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
తెలంగాణ ఏర్పాటు విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్సింగ్ పర్యటన ద్వారా కాంగ్రెస్ అధిష్టానం సానుకూల సంకేతాలు పంపినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో పర్యనటలో దిగ్విజయ్ సింగ్తో కోదండరామ్ సమావేశమయ్యారు. ఇరువురి మధ్య సుదీర్ఘమైన సంభాషణ కూడా జరిగింది.
తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటాల్లో పలు పార్టీలు సహా అనేక ప్రజాసంఘాలను, వివిధ సెక్షన్ల జేఏసీలను, విస్తృత స్థాయిలో తెలంగాణవాదులను టీ జేఏసీ సమన్వయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే తెలంగాణ జెఎసితో చర్చలు జరిపితే పార్టీ అభిప్రాయాలు విస్తృత ప్రజానీకానికి అందటమే కాకుండా ఈ ప్రాంత ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం ఏర్పడుతుందని, విశ్వసనీయత కూడా పెరుగుతుందని సోనియా గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులోభాగంగా కోదండరాంతో సోనియా చర్చలు జరపాలని భావించినట్టు తెలుస్తోంది. కోదండరామ్తో సోనియా భేటీకి తేదీ, సమయం ఖరారు కావాల్సి ఉంది.