'జగన్కే కాదు: నాగార్జున మాటివిలోను పెట్టుబడి'
భూసేకరణ నిమిత్తం కొన్ని కంపెనీలకు ఇచ్చిన అడ్వాన్సులను పెట్టుబడులుగా మళ్లించిన వివరాలను జి2 కార్పోరేట్ సర్వీసెస్ మేనేజర్ చిల్లా రవిరెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. భూసేకరణ నిమిత్తం వాన్పిక్తో మూడు కంపెనీలకు ఒప్పందం కుదిరింది. సదరు మూడు కంపెనీలకు వాన్పిక్ ప్రాజెక్ట్స్ నుంచి రూ.278.72 కోట్లు అందాయని, 2008 ఏప్రిల్లో ఇవి అడ్వాన్సులుగా అందాయని తెలిపారట.
2008లో రూ.108 కోట్లు, 2009లో రూ.150.72 కోట్లు, 2010లో రూ.20 కోట్లు వచ్చాయని, ఈ సొమ్మును సదరు కంపెనీలు వివిధ కంపెనీలలో సర్దుబాటు చేసినట్లు చెప్పారట. జగన్కు చెందిన సిలికాన్లో రూ.12 కోట్లు, జగతి పబ్లికేషన్స్లో రూ.30 కోట్లు, భారతి సిమెంట్స్లో రూ.78 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా చెప్పారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు రూ.40 కోట్లు వెచ్చించారు.
మా టివిలోను రెండు విడతలుగా రూ.22.5 కోట్లు(రూ.8.50 కోట్లు, రూ.14 కోట్లు) పెట్టుబడులుగా పెట్టినట్లు చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోలోను రూ.1.55 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా తెలిపారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూసేకరణ నిమిత్తం వచ్చిన అడ్వాన్స్ రూ.5 కోట్లు చెల్లించామని, వాన్పిక్ సొమ్మును పలు కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టడంతో పాటు పలు కంపెనీలకు రుణంగా కొంత చెల్లించినట్లు కూడా చెప్పారట.
జి2 గ్రూపులో మొత్తం 21 కంపెనీలున్నాయని, వీటి అన్నింటికి సంబంధించిన నిర్ణయాలను నిమ్మగడ్డ ప్రసాద్, ప్రకాశ్లు మాత్రమే తీసుకుంటారని, వాటిని తాము అమలు చేస్తామని, నిమ్మగడ్డకు చెందిన పలు కంపెనీలలో డైరెక్టర్గా ఉన్నప్పటికీ అందుకు ఎలాంటి ప్రతిఫలం తీసుకోలేదని, ఉద్యోగిగా విధులు నిర్వర్తించానని చిల్లా చెప్పారట.