చెర్రీ గొడవ, సిఐడి దాడులు: వెనక్కి తగ్గిన చిరు?

కిరణ్ కుమార్ రెడ్డిపై పోరాటంలో చిరంజీవి వెనక్కి తగ్గడానికి ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ టెక్కీలతో పెట్టుకున్న గొడవ ఓ కారణం కాగా, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంపై సిఐడి దాడులు కారణమని భావిస్తున్నారు. రామ్ చరణ్ తేజతో గొడవ సందర్భంగా టెక్కీలపై దాడి చేసింది చిరంజీవి సెక్యూరిటీ గార్డులనే ఆరోపణలు వచ్చాయి. అదే గనుక నిజమైతే చిరంజీవి చిక్కుల్లో పడుతారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇది కూడా చిరంజీవిని ఇరకాటంలో పెట్టేదేనని అంటున్నారు.
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంపై సిఐడి అధికారులు దాడి చేయడం చిరంజీవి జోరుకు కళ్లెం వేయడానికేననే ప్రచారం జరిగింది. దాడుల్లో సిఐడి అధికారులు పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కేటాయింపులో పలు అక్రమాలు జరిగాయని చాలా కాలం కిందటే ఆరోపణలొచ్చాయి. కొన్ని ప్లాట్లను అనర్హులకు కేటాయించారని, పార్కింగ్ స్థలాలను కూడా ప్లాట్లుగా మార్చేశారని ఆరోపణలున్నాయి. ప్రస్తుత డిజిపి దినేష్రెడ్డి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్న కాలంలోనే ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పటి నుంచి అది ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది.
ఇప్పుడు సిఐడి అధికారులు ఇటీవల జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో సోదాలు చేశారు. ఎప్పుడో ఏళ్ల క్రితంనాటి వ్యవహారాంపై సిఐడి ఇప్పుడు ఎందుకు హడావుడి చేసిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఫైళ్లను చూస్తే అసలు కథ తెలుస్తుందని అంటున్నారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవికి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోనే సొంత ఇల్లు, బ్లడ్బ్యాంకు ఉన్నాయి. చిరంజీవి ఇంటివద్ద కొంత భూమిని ఆయన కబ్జా చేసి ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సొసైటీ కార్యాలయంపై దాడిచేసిన అధికారులు ఆ ఫైలునే ప్రధానంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, చిరంజీవి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహంలో చిక్కుకుపోయారని అంటున్నారు.












Click it and Unblock the Notifications