లక్ష్మినారాయణ బదిలీతో వైయస్ జగన్ హ్యాపీ?
వైయస్ జగన్ లక్ష్మినారాయణ నేతృత్వంలోనే అరెస్టయ్యారు. దీంతో జగన్ ఏడాదికాంలంగా చంచల్గుడా జైల్లో ఉండిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా , దినపత్రిక అధిపతిగా ఉన్న జగన్ను సిబిఐ అరెస్ట్ చేసి జైలుకు తరలించడం సంచలనం సృష్టించింది. ఏడాది కాలంగా కనీసం బెయిల్ కూడా రాకుండా అడ్డు కోవటం మరో సంచలనంగా చెబుతున్నారు.
జగన్ కేసు తెరపైకి వచ్చినప్పుడల్లా సిబిఐ ఎలా వ్యవహరిస్తుం దని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంటోంది. లక్ష్మీనారాయణ వల్లనే అలాంటి పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. రాష్ట్రంలో ఏడేళ్ళ పాటు సిబిఐ హైదరాబాద్ జేడిగా పనిచేసిన లక్ష్మీ నారాయణ సత్యం రామలింగరాజు వంటి ఎన్నో కేసులను ఛేదించారు. గనుల యజమాని గాలి జనార్ధన్రెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకురావటం ద్వారా లక్ష్మినారాయణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపారు.
జగన్ను అరెస్టుతో లక్ష్మినారాయణ దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. సాధారణ ప్రజల్లో కూడా ఆయన పాపులారిటీ పెరిగింది. జగన్ కేసులో లక్ష్మినారాయణ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శోభా నాగిరెడ్డి, అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, కొండా సురేఖ వంటివారు విమర్శలు చేస్తూ వచ్చారు.
అలాంటి విమర్శలకు లక్ష్మీనారాయణ ఏనాడూ స్పందించలేదు. అయితే, ఒక వర్గం మీడియాకు లక్ష్మినారాయణ సమాచారం చేరవేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపించారు. అది పెద్ద వివాదంగా మారింది. దీంతో ఆ తర్వాత లక్ష్మినారాయణ మీడియాతో మాట్లాడడం కూడా తగ్గించారు.