మందకొడిగా ఓటుకు నోటు కేసు దర్యాప్తు: ఎందుకు?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు దర్యాప్తు మందగించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలు వచ్చినప్పటికీ అనుబంధ చార్జిషీట్లను రూపొందించే పనిలోనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఇంకా నిమగ్నమైనట్లు చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తు మందగించడానికి రాజకీయ కారణాలు ఉన్నాయని ఓ వైపు వినిపిస్తుండగా, అందుకు భిన్నమైన కథనాలు కూడా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో అనుబంధ చార్జిషీట్లో చేర్చాల్సిన పేర్లపై ఎసిబి మల్లగుల్లాలు పడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఓటుకు నోటు కేసులో జులై 28వ తేదీన ఎసిబి చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో నలుగురు పేర్లను నిందితులుగా చేర్చింది. వారిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తదితరుల పేర్లను చేర్చాలా, వద్దా అనే సందిగ్ధంలో ఎసిబి అధికారులు పడినట్లు ప్రచారం సాగుతోంది.
ఈ కేసులో వెలుగు చూసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడంలో ఎసిబి విఫలమైనట్లు కూడా చెబుతున్నారు. నగదు రూపంలో లంచం ఇవ్వజూపినందున అది ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకోవడం కష్టంగానే ఉందని అంటున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలోనే డబ్బును స్వాధీనం చేసుకున్నందున అంత వరకు అధి పకడ్బందీ సాక్ష్యంగానే నిలుస్తుందని అంటున్నారు.
నోటుకు ఓటు కేసులో ఎసిబి 39 సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. రేవంత్ రెడ్డి, హరీ సెబాస్టియన్, ఉదయ్ సింహ, జెరూసలెం మత్తయ్య పేర్లను చేర్చి ఎసిబి చార్జిషీట్ను దాఖలు చేసింది. ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరు 22 సార్లు ప్రస్తావనకు వచ్చిందని ఎసిబి చార్జిషీట్లో తెలిపింది. అయితే, అంతకు మించిన సాక్ష్యాలను ఎసిబి సేకరించలేకపోయిందనే మాట వినిపిస్తోంది.