పార్టీ బాధ్యత: రోజంతా.. లోకేష్ కోసం బాబు పావులు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ బాధ్యతలను ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పూర్తిగా తీసుకోనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ సభ్యత్వం అరకోటి దాటిన జోష్ మీదున్న నేతలు భవిష్యత్ పార్టీ పగ్గాలను చేపట్టేది ఎవరా? చర్చ సాగిస్తున్నారు. ప్రధానంగా లోకేష్ పేరు వినిపిస్తోందని అంటున్నారు.
పార్టీలో లోకేష్ ప్రాధాన్యతను చంద్రబాబు క్రమంగా పెంచుతున్నారని అంటున్నారు. గత పదేళ్లుగా పార్టీ కోసం పరోక్షంగా సేవలందిస్తూ వచ్చిన నారా లోకేష్ను ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా అధికారికంగా నియమించారు. కార్యకర్తల సంక్షేమ నిధిని అద్భుతంగా నిర్వహించడమేగాక, పార్టీ సభ్యత్వాన్ని అరకోటి దాటించడంలో కీలక భూమిక పోషించిన అతను భవిష్యత్ పార్టీ అధ్యక్షుడిగా నేతలకు బాబు సంకేతం పంపించారు.

వచ్చే నెల పార్టీ తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించే పనిలో కసరత్తు చేస్తోంది. అది ముగిసిన వెంటనే ఏప్రిల్ లేదా మే నెలల్లో జాతీయ కమిటీని ఏర్పాటు చేయబోతోంది. రెండు రాష్ట్రాలకూ నారా లోకేష్ను సమన్వయకర్తగా లేదా అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ చంద్రబాబు యోచిస్తున్నారని అంటున్నారు. లోకేషన్ను రెండు రాష్ట్రాలకూ అధ్యక్షుడిగా నియమించితే అతనికి అనుబంధంగా మార్గదర్శనం కోసం ఓ కమిటీని కూడా నియమిస్తారని తెలుస్తోంది.
చంద్రబాబు ఓ రోజంతా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమయ్యారు. చివరికి ఐదుగురు నేతలను ఉండమని చెప్పి వారితో మరోమారు అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. ఈ అంతర్గత సమావేశంలో తొలిసారిగా లోకేష్ ప్రత్యక్షంగా పాల్గొని తన సూచనలు, సలహాలను అందించారు. సమావేశం జరిగిన తీరును చూసిన నేతలు లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించడం తప్పదంటున్నారు. ఎమ్మెల్యేలు చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం లోకేష్ తాను మాట్లాడారు.
సమావేశంలో పార్టీ గత ఏడు మాసాల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ఎప్పటికపుడు ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని తదనుగుణంగా ప్రజాపథకాలను రూపుదిద్దడం లక్ష్యంగా సమావేశం జరిగింది. రాజధాని, రైతు రుణమాఫీ తదితర అంశాల పైన చర్చ జరిగిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications