ముభావంగా సెహ్వాగ్: అన్యమనస్కంగా గంభీర్
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ పోటీలకు సిద్ధమయ్యేందుకు ఇక్కడి రోషనారా మైదానంలో ప్రాక్టీస్ సెషన్కు హాజరైన భారత సీనియర్ బ్యాట్స్మెన్ గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ అందరి కంటే భిన్నంగా కనిపించారు. ముభావంగా, అన్యమనస్కకంగా వారు ప్రాక్టీస్ సెషన్ను కొనసాగించారు. మీడియాతోనూ ముక్తసరిగా మాట్లాడారు.
ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ పోటీల గురించి చెప్పడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. మిగతా ఆటగాళ్లంతా తెల్ల దుస్తులు వేసుకొని ప్రాక్టీస్ సెషన్కు హాజరైతే, వీరిద్దరూ అందుకు భిన్నంగా రంగు దుస్తుల్లో కనిపించారు. సహచరులతో సరదాగా గడిపే అలవాటున్న వీరిద్దరూ మైదానంలో ఒక పక్క కూర్చున్నారు.
అనంతరం కొంత సేపు నెట్స్కు హాజరయ్యారు. ఆదివారం నుంచి సౌరాష్ట్రతో జరగనున్న రంజీ మ్యాచ్ కోసం వీరు ఇక్కడి రోషనారా క్లబ్ గ్రౌండ్లో చెమటోడ్చారు. అయితే ప్రాక్టీస్ సందర్భంగా ఆ ఇద్దరి ముఖాల్లో నిరాశనిస్పృహలు స్పష్టంగా కనిపించాయి.
ప్రతీబంతినీ బాదాలన్న కసితో సెహ్వాగ్ బ్యాటింగ్ కొనసాగించాడు. అందులో పూర్తిగా సక్సెస్కాకున్నా, నెట్స్ లో అతను ఆఖరు షాట్ను కవర్స్మీదుగా లాగిపెట్టికొట్టాడు. బంతి నేరుగా వెళ్లి అల్లంతదూరాన ఉన్న ప్రయివేట్ లైబ్రరీ కిటికీ అద్దాల్ని బద్దలుకొట్టేసింది.
అక్కడ తనను కలిసిన మీడియాతో అంటీముట్టనట్టు మాట్లాడిన గంభీర్, రంజీ ట్రోఫీ మ్యాచ్లకు సిద్ధమయ్యే విషయం తప్ప మరో అంశాన్ని గురించి మాట్లాడబోనని స్పష్టం చేశాడు.
ఫిరోజ్ షా కోట్లా మైదాంలో ఎన్నో మ్యాచ్లు ఆడానని, రంజీలో అక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయని అతను జోస్యం చెప్పాడు. సెహ్వాగ్ సైతం మీడియాతో మాట్లాడేందుకు అంతగా ఆసక్తిని ప్రదర్శించలేదు. రంజీ ట్రోఫీపైనే తమ దృష్టి కేంద్రీకృతమైందని అతను అన్నాడు. ఇతరత్రా అంశాలను గురించి ఆలోచించే తీరిక తనకు లేదని వ్యాఖ్యానించాడు.
ప్రపంచ కప్ కోసం ప్రకటించిన 30మంది ప్రాబబుల్స్ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ లతోపాటు సీనియర్ ఆటగాళ్లయిన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్లకు చోటు దక్కని విషయం తెలిసిందే.