ఏపీ రాజధానిగా తుళ్లూరు మండలం..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా తుళ్లూరు మండలం ఎంపికైంది. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని తుళ్లూరు మండల పరిధిలోనే కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాటి పార్టీ ఎంపీల భేటీ సందర్భంగా దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నారు.
తొలి విడతలో ఈ గ్రామాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరిస్తారు. ఈ భూమిని ఐదు జోన్లుగా విభజిస్తారు. ఒక్కో జోన్లో కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తారు. తుళ్లూరుకు కేవలం ఐదు కిలో మీటర్ల దూరంలోనే కృష్ణా నది ప్రవహిస్తోంది.
ఇక అమరావతికి 20 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రదేశం వుంది. విజయవాడకు 25 కిలో మీటర్లు, గుంటూరుకు 33 కిలో మీటర్ల దూరంలో తుళ్లూరు ఉంది. ఇక జాతీయ రహదారిపై ఉన్న మంగళగిరికి ఇది కేవలం 20 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. దీంతో అన్ని రకాలుగా తుళ్లూరు మండలమే కొత్త రాజధానికి అనువుగా ఉందని చంద్రబాబు ప్రభుత్వం అభిప్రాయపడింది.

మండలంలోని 30 వేల ఎకరాల విస్తీర్ణంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసేందుకు త్వరలో కసరత్తు మొదలు కానుంది. రాజధాని నిర్మాణ కమిటీ సమావేశం ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా భూమి ఇచ్చే రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీపై చర్చించారు. మూడు అంశాలతో ఒక ప్యాకేజీని ఈ సమావేశం ఖరారు చేసింది.
దీని ప్రకారం.. ఎకరం భూమి ఇచ్చే రైతుకు రాజధాని నిర్మాణ ప్రాంతంలో వెయ్యి గజాల నివాస స్థలం ఇస్తారు. దీనితోపాటు రైతులకు అదనపు ప్రోత్సాహకంగా ఎకరానికి రూ.25 వేలు చొప్పున పదేళ్లపాటు డబ్బు చెల్లించనున్నారు. రాజధాని కోసం ఇచ్చిన భూమిపై రైతుకు వచ్చే ఆదాయానికి సమానంగా ఈ డబ్బు ఇస్తారు. దీనిని ఏడాదికి ఐదు శాతం చొప్పున పెంచుతూ పోతారు.
ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతానికి చుట్టూ కొన్ని వేల కిలోమీటర్ల పరిధి వరకూ భూ వినియోగ మార్పిడిని ప్రభుత్వం నిషేధించనుంది. దీంతో, ప్రస్తుతం ఉన్న వ్యవసాయ భూములను వ్యవసాయానికి వినియోగించడం తప్ప మరో అవసరానికి వినియోగించకూడదు.
ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వరు. ఆయా భూముల్లో రైతులు చేస్తే వ్యవసాయం చేయాలి లేకుంటే ప్రభుత్వానికి ఇవ్వాలి. ఐతే, రాజధాని నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తి చేయాలని, దీనికి అవసరమైన కసరత్తును వేగవంతంగా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూమి ఇవ్వడానికి ఎవరైనా రైతులు నిరాకరిస్తే భూ సేకరణ పద్ధతిలో వారి భూములు తీసుకోవాలని ఆయన వారికి సూచించారు. ఇక, రాజధానికి భూ సమీకరణలో భాగంగా, జీవనోపాధి కోల్పోయిన భూమి లేని నిరుద్యోగులకు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉపాధి దొరికేలా చేస్తారు. దీనికి అవసరమైన శిక్షణను కూడా వారికి ఇస్తారు. భూ సమీకరణకు ఆయా జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) అథారిటీని రద్దు చేసి దాని స్థానంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ సంస్థ స్వయం ప్రతిపత్తితో పని చేస్తుంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ (హెచ్ఎండీఏ)కి మించి మరిన్ని అధికారాలతో సీఆర్డీఏ పని చేస్తుంది. వచ్చే వారంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రణాళిక ఇచ్చే సంస్థను ఖరారు చేయాలని నిర్యం తీసుకున్నారు. ఇందుకు గాను ఇప్పటికే బిడ్లు ఆహ్వానించారు. దీనితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలను సుందరంగా తీర్చిదిద్ది రాజధాని రూపు తేవాలని సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications