రాజధానికి ఎపి కమిటీ: రాయలసీమకు నో చాన్స్
హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎంపికకు కేంద్రం ఏర్పాటు చేసిన రిటైర్డు ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక మరో 40రోజుల్లో కేంద్రానికి అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణ రూపురేఖలు, నిధుల సమీకరణపై కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదివారం జీవో జారీ చేసింది. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎంపిక ప్రదేశం వివాదమవుతున్న తరుణంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం, అభివృద్ధి, నిధుల సమీకరణకు కొత్త కమిటీ వేయడం సంచలనం కలిగిస్తోంది.
కాగా, ఈ కమిటీలో రాయలసీమకు చెందినవారు లేకపోవడం సమస్యగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాజధాని రాయలసీమలో ఉండాలని ఆ ప్రాంతానికి చెందిన మేధావులు, రచయితలు ఉద్యమం ప్రారంభించారు.
కొత్త రాజధాని రూపురేఖలు ఎలా ఉండాలో కమిటీ నిర్దేశిస్తుంది. తొమ్మిదిమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి ఆరు మార్గదర్శక సూత్రాలు నిర్దేశించారు. కమిటీ చైర్మన్గా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఉంటారు. సభ్యులుగా రాజ్యసభ సభ్యులు వైఎస్ చౌదరి, గుంటూరు టిడిపి ఎంపీ జి జయదేవ్, నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీడ మస్తాన్ రావు, జివికె గ్రూప్ యాజమాన్య ప్రతినిధి జివి సంజయ్ రెడ్డి, జిఎంఆర్ గ్రూపు యాజమాన్య ప్రతినిధి బొమ్మిడాల శ్రీనివాస్, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ ఎం ప్రభాకరరావు, పీపుల్ క్యాపిటల్ చైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు, కన్వీనర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ డి సాంబశివరావు ఉంటారు.

కమిటీలో అదనంగా ముగ్గురు సభ్యులను నియమించుకునే అధికారాన్ని కల్పించారు. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో వివిధ రంగాల్లో నిపుణలను సభ్యులుగా నియమించుకోవచ్చు. కమిటీ పని విధానాన్ని జీవోలో నిర్దేశించారు. దీనికి మార్గదర్శకాలను ఖరారు చేశారు. 1. మహాద్భుతమైన , వైవిధ్యమైన, సమీకృతాభివృద్ధి కలిగిన నగరాన్ని ఎంపిక చేయాలి. నగరంలో నైపుణ్యం కలిగిన పనివారు ఉండాలి 2. నివాసయోగ్యం ఉన్న ప్రాంతంగా ఉండాలి. పట్టణ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలి. నగర ప్రజలు సంతోషకరమైన జీవన విధానాన్ని గడిపే విధంగా ఉండాలి. 3. భూమి, నీరు, విద్యుత్తును పొదుపుగా సమర్ధంగా వినియోగించుకోవాలి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని నగరాభివృద్ధి చేపట్టాలి. 4. నగర ప్రణాళిక ఖరారు చేయాలి. రవాణా కారిడార్ల విధానాలను చేర్చాలి. అతి పెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతమంతటా కారిడార్లను విస్తరించాలి. 5. తక్కువ ఖర్చుతో చక్కటి నైపుణ్యంతో యాజమాన్య వ్యవస్థను అభివృద్ధి చేయాలి. కొత్త రాజధానికి అవసరమైన అదనపు నిధుల సమీకరణకు విధివిధానాలు ఖరారు చేయాలి.
రాజధానికి నిధులు కేటాయిస్తామని కేంద్రం ఇదివరకే హామీ ఇచ్చింది. నిర్ణీత కాలపరిమితి లోపల కమిటీ కొత్త రాజధాని నిర్మాణంపై విధి విధానాలు ఖరారు చేసి సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ చట్టంలో రాష్ట్రంలో రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, ఇతర అవసరమైన వౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని జీవోలో పొందుపరిచారు.
కమిటీ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం, నిధుల సమీకరణపై సలహామండలిగా పనిచేస్తుందని జీవోలో స్పష్టం చేశారు. కమిటీలో రాయలసీమకు చెందిన కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన వారు లేరు. కానీ నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రి నారాయణ, పారిశ్రామికవేత్త జివి సంజయ్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే సభ్యులుగా ఉండటం విశేషం.
తమ సలహా సంఘం మూడు నెలల్లో నివేదిక ఇస్తుందని, త్వరలో విదేశాల్లో పర్యటించి రాజధాని నిర్మాణాలపై పరిశీలన అధ్యయనం చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. వచ్చే నెలలోనే రాజధాని ఎక్కడో తేలిపోతుందన్నారు. త్వరలో శివరామకృష్ణన్ కమిటీని కలుస్తామన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రదేశంలో రాజధాని ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications