రాజ్యసభ: జగన్కు కొత్త తలనొప్పి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకే ప్లస్!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభ విషయంలో కొత్త షాక్! త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ.. ఎన్నికల నాటికి వైసిపి నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను సైకిల్ ఎక్కించుకోవాలని టిడిపి భావిస్తోంది.
ఇప్పటికే పదకొండు మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల లెక్క ప్రకారం చూసుకుంటే నాలుగింట వైసిపికి ఒక రాజ్యసభ దక్కనుంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా అది కూడా దక్కకుండా చేయాలని టిడిపి స్కెచ్ వేస్తోంది.
ఓ వైపు ఇప్పటికే పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న జగన్కు మరో తలనొప్పి వచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో గీత దాటినా ఎమ్మెల్యేల పైన అనర్హత ఉండదని అంటున్నారు. ఇది జగన్కు మరో తలనొప్పిగా మారిందని అంటున్నారు.

ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మాం, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం, ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లు ఓటింగ్.. వంటి వాటిల్లో జగన్కు రివర్స్ అయింది. వీటి ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వేటు వేయించేందుకు జగన్ ప్రయత్నాలు చేసినప్పటికి.. ప్రభుత్వం పైఎత్తు వేసి, జగన్ ఎత్తులను చిత్తు చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన క్రమశిక్షణ చర్యల కోసం.. జూన్లో జరిగే రాజ్యసభ ఎన్నికలకు తమకు ఉపయోగపడతాయని వైసిపి ధీమాగా ఉంది. ఈ ఎన్నికల్లో విప్ను ధిక్కరించి ఓటు వేసిన వారిని అనర్హులుగా ప్రకటించేందుకు తమకు కచ్చితంగా అవకాశం వస్తుందని భావిస్తున్నారు.

కానీ ఆయన ఆశలపై ఈసీ నీళ్లు కుమ్మరించింది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ను ధిక్కరించి ఓటు వేసినంత మాత్రాన ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసే ఆస్కారం లేనే లేదని తేల్చి చెప్పింది. కావాలంటే పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని సూచించింది. ఇక పార్టీ పరంగా అయితే పార్టీ నుంచి సస్పెన్షన్ మినహా లాభం లేదు.
ఈ చర్య పరోక్షంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకే లబ్ధి చేకూర్చుతుంది. తద్వారా భవిష్యత్లో వైసీపీ ఆ ఎమ్మెల్యేల జోలికి వచ్చే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దారులన్నీ మూసుకుపోయాయని, ఇక 2019 ఎన్నికల వరకూ వేచి ఉండడం మినహా జగనకు గత్యంతరం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications