తెంపేసుకుందాం: చంద్రబాబుపై బిజెపి నేతల మండిపాటు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి నాయకులు గుర్రుగా ఉన్నారు. ప్రత్యేక హోదాపై తెలుగుదేశం అనుసరిస్తున్న వైఖరి వారికి నచ్చడం లేదు. ప్రభుత్వంలో కొనసాగుతూ ప్రభుత్వాన్నే తప్పుపడుతూ తమను కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదనే అభిప్రాయం బిజెపి నేతల్లో వ్యక్తమవుతోంది.
తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకోవాలని రాష్ట్రానికి చెందిన మెజారిటీ బిజెపి నాయకులు అభిప్రాయపడుతుండగా, బిజెపికి చెందిన రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు మాత్రం అందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
టిడిపితో స్నేహం కొనసాగుతుందని, తమ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ప్రయత్నిస్తున్నాయని మంత్రులు అన్నారు. మిగతా నాయకులకు వారి మాటలు రుచించడం లేదు. సుజనాచౌదరి కేంద్రమంత్రిగా ఉంటూనే బిజెపిని విమర్శిస్తుంటే, తమ మంత్రులు మాత్రం టిడిపిపై ప్రేమను కురిపిస్తున్నారని బిజెపి నాయకులు అంటున్నారు.
చంద్రబాబు సహా ఎంపీలు తమ పార్టీపై చేస్తున్న విమర్శలకు తగిన జవాబు చెప్పకుండా, కలసి ఉండాలని ప్రకటించడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయం బిజెపిలో ఉంది. పైగా, బిజెపితో కొనసాగవద్దంటూ టిడిపి నాయకులు కొంత మంది గళమెత్తుతున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని టిడిపి ఎంపి జెసి దివాకర్రెడ్డి, బుద్దావెంకన్న అన్నారు., బిజెపి నేతలను అడుగుపెట్టనీయకుండా అడ్డుకోవాలని టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి తదితరులు రెండురోజుల నుంచి వ్యాఖ్యలు చేస్తున్నారు.

చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వారితో అలా మాట్లాడిస్తున్నారని బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. టిడిపి నాయకులు అలా మాట్లాడుతూ, చంద్రబాబు కూడాతమను కార్నర్ చేయాలని చూస్తుంటే, ఇంకా టిడిపితో కొనసాగడం అంత మంచిది కాదనే అభిప్రాయాన్ని బిజెపిలోని కొంత మంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పదవుల్లో కొనసాగుతున్న మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్ పట్ల బిజెపి నాయకుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. విజయవాడ గుళ్ల కూల్చివేత విషయాన్ని దేవాదాయ శాఖను నిర్వహిస్తున్న తమ పార్టీకి చెందిన మంత్రి మాణిక్యాలరావుకు చెప్పలేదని, కామినేని చేతిలో ఉన్న వైద్యశాఖలో కూడా నేరుగా సీఎంఓనే నిర్ణయాలు తీసుకుంటోందని బిజెపి నాయకులు అంటున్నారు.
టిడిపితో విడిపోతేనే రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి అవకాశం చిక్కుతుందనే అభిప్రాయంతో సీనియర్ బిజెపి నాయకులున్నారు. పైగా, చంద్రబాబు ప్రమేయం కారణంగానే ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడి ఎంపిక ఆగిపోయిందనే అభిప్రాయం కూడా ఉంది.
ఇతర పార్టీల నుంచి బిజెపిలోకి వచ్చిన కన్నా లక్ష్మినారాయణ, దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివరావుతో సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, సురేష్రెడ్డి వంటి నాయకులు కూడా రాష్ట్రంలో సొంతంగా ఎదిగేందుకు టిడిపితో పొత్తు అడ్డంకిగా మారిందనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
బిజెపితో పొత్తు వల్ల తాము 15 సీట్లు నష్టపోయామని చంద్రబాబు అనడంపై కూడా బిజెపి నాయకులు మండిపడుతున్నారు. తాము సొంతంగా బలపడడానికి చాలా సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయని, వాటిని తీసుకుని ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలు పెడితే బలపడడానికి అవకాశం ఉంటుదని బిజెపి నాయకులు కొంత మంది అంటున్నారు.












Click it and Unblock the Notifications