నాలుగు స్తంభాలాట: బిజెపి క్రీడలో బాబు, జగన్, పవన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజా ప్రకటనతో బిజెపిలోని విభేదాలు మరోసారి చర్చకు వచ్చాయి. ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో కలిసి నడుస్తానని ఆయన చెప్పారు.
జగన్ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలు రెండుగా చీలిపోయి మాట్లాడారు. జగన్తో పొత్తు ఎలా పెట్టుకుంటామని ఓ వర్గం మాట్లాడగా, ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించకుండా జగన్ ప్రకటనను మరో వర్గం ఆహ్వానించింది.
చంద్రబాబుతో స్నేహం కొనసాగుతుందా..
బిజెపి భవిష్యత్తు వ్యూహమేమిటనేది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో వచ్చే ఎన్నికల్లో కలిసి నడుస్తుందా, తెగదెంపులు చేసుకుంటుందా అనేది తేలడం లేదు. విష్ణుకుమార్ రాజు వంటి నాయకుల ప్రకటనలను చూస్తే తెగదెంపులకే సిద్ధపడినట్లు అనిపిస్తుంది.
జగన్తో ఎలా పనిచేస్తుంది...
జగన్ విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం అనుసరిస్తన్న వైఖరి కూడా స్పష్టం కావడం లేదు. చంద్రబాబుకు అనుకూల బిజెపి నాయకులు మాత్రం జగన్తో పొత్తు కుదరదని అంటున్నారు. సిబిఐ కేసులను ప్రస్తావిస్తూ జగన్తో ఎలా పొత్తు పెట్టుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ వంటి చంద్రబాబు అనుకూల వర్గానికి చెందిన నాయకులు అంటున్నారు.
పవన్ కల్యాణ్ ఎటు వైపు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటు వైపు ఉంటారనేది తెలియడం లేదు. ఆయన ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తానని అంటున్నారు. అయితే, ఆయన బిజెపిపై విమర్శలు చేస్తున్నారు. దానివల్ల ఆయన బిజెపికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నట్లు అనుకుంటున్నారు. బిజెపితో తమతో కలిసి వచ్చినా, రాకపోయినా పవన్ కల్యాణ్తో వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు.
చంద్రబాబు ఆటంకమా...
బిజెపి రాజకీయ వ్యూహం ఏమిటనేది అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలం పుంజుకోవాలనే ఉద్దేశంతో మాత్రం ఉంది. దానికి చంద్రబాబు ఆటంకంగా ఉన్నారని బిజెపిలోని ఓ వర్గం వాదిస్తోంది. అందువల్ల ఒంటరిగానైనా పోటీ చేయాలి, లేదంటే జగన్తో పొత్తు పెట్టుకోవాలని ఆ వర్గం అంటోంది.
ముగ్గురితో బిజెపి సయ్యాట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముగ్గురు ప్రధాన రాజకీయ నాయకులు చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్లతో బిజెపి రాజకీయ క్రీడను కొనసాగిస్తోందా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో ఓ రకమైన అస్థిరత కొనసాగేలా చూసి తాను ప్రయోజనం పొందాలనే ఎత్తుగడలో బిజెపి జాతీయ నాయకత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.