జ్యోతిష్కులు తేల్చేశారు: ఆరునూరైనా సిఎంగా శశికళ
ఏది ఏమైనా, ఎవరు వ్యతిరేకించినా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికే శశికళ సిద్ధమైనట్లు తెలుస్తోంది. జ్యోతిష్కులు ముహూర్తాలు కూడా నిర్ణయించారని సమాచారం.
చెన్నై: ఏది ఏమైనాసరే, తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనే పట్టుదలతోనే చిన్నమ్మ శశికళ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు జ్యోతిష్కులు ముహూర్తాలు కూడా నిర్ణయించారని సమాచారం. జయలలిత మరణం తర్వాత అన్నాడియంకె పగ్గాలు చేపట్టిన ఆమె ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. కింది స్థాయిలో పార్టీలో వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ వెనక్కి తగ్గకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ నెలాఖరులోపు ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని సమాచారం. శశికళకు జ్యోతిష్యులు తాజాగా ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం ఆమె ఈనెల 19 లేదా 27 తేదీల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం తప్పదని అంటున్నారు.
జయలలిత మరణం తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించిన శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఆమె తప్ప మరెవ్వరూ అర్హులు కాదని పార్టీ నేతలతో చెప్పించడమే గాక తననే ఏకగ్రీవంగా ఎన్నుకునేలాచ వ్యూహరచన చేసి అమలు చేశారు. అనంతరం పార్టీపై గట్టి పట్టు సాధించారు. అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించారు.
అచ్చం అమ్మ జయలలితలాగే...
అచ్చం జయలలిత లాగా కట్టుబొట్టుతో ఆమెను మరిపించేలా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీలో మొదట్లో ఆమె పట్ల వ్యక్తమైన వ్యతిరేకత కొంత తగ్గిందని చెబుతున్నారు. కాగా పన్నీర్ సెల్వం సీఎం పదవిని చేపట్టిన మూడు రోజులకే డిసెంబర్ 8వ తేదీన ముగ్గురు సీనియర్ మంత్రులు శశికళ పార్టీ పగ్గాలతో పాటు, సీఎం పదవిని కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత మరింతగా పెరిగింది...
కొద్దిరోజులకు ఆ ముగ్గురికి మరో ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా వారికి వంత పాడారు. ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన తంబిదురై కూడా శశికళకు మద్దతు ఇస్తున్నారు. కాగా, పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టినప్పటికీ ప్రజా కార్యక్రమాలల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు. రోజూ మొక్కుబడిగా సచివాలయానికి వెళ్లి వస్తున్నారు. అక్కడ కూడా సీఎం చాంబర్కు వెళ్లకుండా గతంలో తాను ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపయోగించిన గదిలో నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పన్నీరు ప్రారంభోత్సవాల రద్దు ఇందుకే...
ముఖ్యమంత్రిగా శశికళ త్వరలో బాధ్యతలు చేపడతారని అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం పన్నీర్సెల్వం గురువారం చేయాల్సిన పలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలు అకస్మాత్తుగా రద్దు కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పన్నీర్ సెల్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుత్తణి, ఊత్తుకోట పోలీసు స్టేషన్ భవనాలు సహా పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించాల్సి వుంది. ఇందుకు ముందుగానే ప్రకటనలు జారీ అయ్యాయి. కానీ బుధవారం అర్ధరాత్రి సీఎం తలపెట్టిన ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలన్నీ రద్దయినట్లు అధికారిక ప్రకటన జారీ అయింది. ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
విజయవాడలో చంద్రబాబుతో భేటీ..
విజయవాడలో చంద్రబాబును కలుసుకునేందుకే పన్నీర్ సెల్వం ఈ కార్యక్రమాలను రద్దు చేసుకుని వుంటారని అన్నాడీఎంకే వర్గాలు మొదట భావించాయి. అయితే అవన్నీ ఉదయం 10 గంటలకే జరగాల్సినవనీ, విజయవాడ పర్యటన ఈ కార్యక్రమాల రద్దుకు కారణం కాదని అంటున్నారు. త్వరలో శశికళ సీఎం పదవిని స్వీకరించడం ఖరారైన నేపథ్యంలో పన్నీర్సెల్వం ప్రారంభోత్సవాలను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.
నిజానికి అప్పుడే చేపట్టాల్సింది..
నిజానికి శశికళ గురువారమే (12వ తేదీ) సీఎంగా పదవిని చేపట్టాలని మొదట అనుకున్నారు. మార్గశిర మాసంలో ప్రమాణస్వీకారం చేస్తే మంచిది కాదని ఆమె కుటుంబసభ్యులు చెప్పడంతో ఆమె ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె జ్యోతిష్కులను సంప్రదించి కొత్త ముహూర్తాలు చూసుకున్నట్లు చెబుతున్నారు.
తమిళులకు మంచిదని సలహా..
తమిళులకు అచ్చొచ్చిన తైమాసం సీఎంగా ప్రమాణస్వీకారానికి మంచిదని జ్యోతిష్యుల సూచన మేరకు ఈ నెల 19 లేదా 27వ తేదీన సీఎంగా ప్రమాణస్వీకారానికి శశికళ నటరాజన్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ రెండు ముహూర్తాలు కూడా తప్పిపోతే జయలలిత జయంతి లోపు, అంటే ఫిబ్రవరి 24వ తేదీలోపు శశికళ ముఖ్యమంత్రి కావడం మాత్రం తథ్యమని అంటున్నారు.