వణికిస్తున్న బర్డ్ ఫ్లూ: కోళ్ల పాతర (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదును బర్డ్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది. అకాల వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాదు నగరాన్ని బర్డ్ ఫ్లూ వైరస్ భయపెడుతోంది. తాజాగా బర్డ్ఫ్లూ వైరస్ రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో చూసింది. వైరస్ ఉన్నట్లు పూణెలోని వైద్య నిపుణులు నిర్థారించటంతో చికెన్ కొనుగోలు చేసేందుకు నగరవాసులు జంకుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో బర్డ్ఫ్లూ వైరస్ను నిర్థారించటంతో పాటు త్వరలోనే పూణె నుంచి రానున్న ప్రత్యేక వైద్యుల బృందం వైరస్ వెలుగుచూసిన హయత్నగర్కు చుట్టూ కిలోమీటరు పరిధిలోని అన్ని కోళ్ల పరిశ్రమలను సందర్శించి, కోళ్లకు తగిన పరీక్షలు చేయనున్నారు.
బర్డ్ఫ్లూ వైరస్ ఉన్నా, లేకపోయినా ముందుజాగ్రత్త చర్యగా ప్రస్తుతం హయత్నగర్కు కిలోమీటరు పరిధిలోనున్న అన్ని కోళ్ల పరిశ్రమలోని కోళ్లను పూడ్చివేయాలని సూచించటంతో ఆరోగ్యపరంగా ప్రజలు, వ్యాపార పరంగా చికెన్ హోల్సెల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
పడిపోయిన చికెన్ ధరలు..
ఇటీవలి వరకు కిలోకు రూ. 150 నుంచి రూ. 160 మధ్యనున్న స్కిన్లెస్ చికెన్ ధర అకాల వర్షాల కారణంగా రూ. 130 నుంచి రూ. 140 కి పడిపోయిందని, ఇపుడు బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూడటంతో మున్ముందు తమ వ్యాపారాలు మరింత దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది.
గతంలో కూడా..
గతంలో కూడా సరిగ్గా దశాబ్ద కాలం క్రితం బర్డ్ ఫ్లూ నగరంలో స్వైరవిహారం చేసింది. అప్పట్లో తీవ్ర ఆందోళనకు గురైన కోళ్ల పరిశ్రమ యజమానులు కోళ్లను చంపి, పాతేశారు.
పాతరేయడమే...
కల్డ్ బర్డ్స్ను బొందల్లో సున్నం పొరలతో పాతేయాలని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ డి. వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు.
18 గ్రామాల్లో....
హయత్నగర్ చుట్టుపక్కల గల 18 గ్రామాల్లోని సాంపిల్స్ సేకరించి, పరీక్షల నిమిత్తం భోపాల్కు పంపిస్తారు. ఈ ప్రక్రియ 30 రోజుల పాటు సాగుతుంది.