వివాదం: బిజెపి మంత్రులపై చంద్రబాబు గరం
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలోని ఇద్దరు బిజెపి మంత్రులు కష్టాలను ఎదుర్కుంటున్నారు. వారి పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. వారి పనితీరు పట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిపై ఆయన బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గత కొద్ది కాలంగా దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు పరిస్తితి కాస్తా మెరుగు మాత్రమే. తన పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాణిక్యాల రావు బిజెపి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గోదావరి పుష్కరాలు తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చినప్పటికీ తనను పూర్తిగా పక్కన పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు.
కామినేని శ్రీనివాస రావు పరిస్థితి కాస్తా భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దగ్గర కావడానికి ఆయన తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా టిడిపి వ్యక్తి లాగే ప్రవర్తిస్తున్నారు. అయితే, ఆయనకు అది ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. చంద్రబాబు ఆయనను దూరమే పెడుతున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కరాల సమయంలో అన్ని ఘాట్ల వద్ద అంబులెన్స్లను పెట్టడంలో ఆయన విఫలమయ్యారని, దానివల్లనే తొక్కిసలాటలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించలేకపోయామని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పిల్లలపై ఎలుకల దాడి విషయంలో కూడా కామినేని శ్రీనివాస రావు చంద్రబాబు నుంచి వ్యతిరేకత ఎదుర్కుంటున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో బిజెపి మంత్రులను మార్చాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని తొలగించి, బిజెపికి చెందిన ఇతర శాసనసభ్యులను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి చంద్రబాబు బిజెపి నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.
విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజును, రాజమండ్రి నగరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి శాసనసభ సమావేశాల్లో విష్ణుకుమార్ రాజు చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. పట్టిసీమ ప్రాజెక్టును సమర్థిస్తూ ఆయన చంద్రబాబును భగీరథుడితో పోల్చారు.