బ్లాక్మనీ: 'పెద్దోళ్లు' లేని పాత లిస్ట్, జర్మనీ నిరసన!
న్యూఢిల్లీ: కేంద్రం నల్లధన కుబేరుల జాబితాను బుధవారం నాడు సుప్రీం కోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. 327మంది పేర్లను ఇచ్చింది. ఒక జాబితాలో నల్లధనం కలిగి ఉన్నవారు పేర్లు, రెండో జాబితాలో విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారి పేర్లు, మూడో జాబితాలో నల్లధనం కేసు వివరాలున్నాయి. దర్యాప్తునకు సుప్రీంకోర్టు సిట్కు 2015 మార్చి వరకు గడువిచ్చింది. సిట్ దర్యాప్తు నివేదికును నవంబర్ లోగా తమకు సమర్పించాలని ఆదేశించింది. విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది.
కాగా, ఈ కొత్త కవర్లో పాత జాబితా ఉన్నదని వార్తలు వస్తున్నాయి. అందరు కూడా జెనీవాలోని హెచ్ఎస్బీసీ ఖాతాదారులు. అందరు ఊహించినట్లుగా ఇందులో ప్రముఖుల పేర్లు, పెద్ద మొత్తంలో డబ్బు ఉండకపోవచ్చునంటున్నారు. అంతేకాకుండా ఈ వివరాలు 2006 నాటివి. లావాదేవీలు 1999-2000 సంవత్సరాలకు సంబంధించినవి. ఈ జాబితా పైన సిట్ కూడా పెదవి విరిచింది!
ప్రభుత్వం సమర్పించిన జాబితాలో కొత్త సమాచారమేమీ లేదని, అందులోని వివరాలు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని సిట్ అధ్యక్షుడు జస్టిస్ ఎంబీ షా చెప్పారు. కాబట్టి, ఆది నుంచి విచారించాల్సి ఉంటుందన్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న విచారణలో ఎలాంటి ఫలితమూ రాలేదన్నారు. గడువులోగా తుది నివేదిక సమర్పిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు నల్ల కుబేరులపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. సుప్రీంకు కేంద్రం సమర్పించిన 627 మందిలో 235 మంది ముంబై నగరానికి చెందిన వారేనని, వారిలో 90 మంది వివరాలు సేకరించామని ఐటీ అధికారులు వెల్లడించారు. ఈ భారీ మొత్తం వెనుక ఏదైనా నేర చరిత్ర ఉందా? అనే అంశాలను తెలుసుకోవడం, తద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించడమే తమ లక్ష్యమని అధికారులు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ... ఇందులోని నల్ల ఖాతాదారుల వివరాలు 2006 నాటివని, వారి వివరాలను 2011లో ఫ్రెంచి ప్రభుత్వం భారత్కు అందజేసిందని తెలిపారు. ఈ సమాచారాన్ని జెనీవాలోని హెచ్ఎస్బీసీ బ్యాంకు నుంచి దొంగిలించారని, ఆ తర్వాత అది ఫ్రాన్స్కు చేరిందని, చివరికి, అక్కడి ప్రభుత్వం చేతికి చిక్కిందని వివరించారు.
సీల్డ్ కవర్లో మూడు పత్రాలు ఉన్నాయని, వాటిలో ఒకటి ఫ్రెంచి ప్రభుత్వంతో భారత ప్రభుత్వం జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలని, రెండోది నల్ల కుబేరుల జాబితా అని, మూడోది స్థాయీ నివేదిక అని వివరించారు. జాబితాలోని సగానికి సగం మంది ఖాతాదారులు భారత్లోనే నివసిస్తున్నారని, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం వారిని విచారించవచ్చని, మిగిలిన వారు మాత్రం ప్రవాస భారతీయులని వివరించారు.
హెచ్ఎస్బీసీలోని ఆయా ఖాతాలకు సంబంధించిన అత్యధిక లావాదేవీలు 1999-2000 సంవత్సరాల మధ్యలో జరిగాయని తెలిపారు. విదేశీ బ్యాంకు ఖాతాలు అన్నిటినీ 2015 మార్చి నాటికి అసెస్ చేయాల్సి ఉందని వివరించారు. జాబితాలోని పేర్లను సుప్రీం కోర్టు చూసినా, దాని దర్యాప్తును సిట్కు అప్పటించినా తమకు అభ్యంతరం లేదన్నారు. బ్యాంకు ఖాతాదారుల పేర్లను వెల్లడించడం పైన జర్మనీ ఇటీవల భారత్ ప్రభుత్వానికి తన నిరసనను తెలియజేసిందని చెప్పారు.
లిచ్ టెన్ స్టెయిన్ బ్యాంకులో చట్టబద్ధంగా ఖాతాలను కలిగి ఉన్న ఎనిమిది మంది భారతీయుల పేర్లను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది మే నెలలో బహిరంగపరిచామన్నారు. దీని తర్వాత జర్మనీ అధికారుల నుండి లేఖ వచ్చిందని, ఖాతాదారుల పేర్లను ఎందుకిచ్చారో చెప్పాలని వివరణ అడిగారన్నారు. ఒప్పందంలో భాగంగా వివరాలు తాము 2009లో అందజేశామని, వాటిని గోప్యంగా ఉంచాలని ఒప్పందంలో పేర్కొన్నామని జర్మనీ గుర్తు చేసిందని రోహత్గీ అన్నారు. దీనిపై కేంద్రం వివరణ ఇస్తుందన్నారు.












Click it and Unblock the Notifications