కిరణ్కు కౌంటర్: తెలంగాణకు ఇందిరా ఫేవర్?
హైదరాబాద్: స్వర్గీయ ఇందిరా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ వస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల సమస్యలు వస్తాయని చెప్పిన ఇందిరా గాంధీ మాటలనే చెబుతూ వస్తున్నానని ఆయన చెబుతున్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాటల్లో వాస్తవం లేదని ఇటీవల విడుదలైన ఓ పుస్తకం తెలియజేస్తోంది. ఇందిరా గాంధీ 1969లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని అనుకున్నట్లు ఆ పుస్తకం తెలియజేస్తోంది.
అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ముందుకు వచ్చిన ఇందిరా గాంధీ వెనక్కి తగ్గడానికి మరో కారణం ఉందని ఆ పుస్తకం తెలియజేస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వద్ద పాకిస్తాన్ దాఖలు చేసిన పిటిషన్ పెండింగులో ఉండడంతో ఇందిరా గాంధీ మనసు మార్చుకుని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచినట్లు ఆ పుస్తకం వివరిస్తోంది.

స్టేట్స్ రీఆర్గనైజేషన్: ఏ కేస్ స్టడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేర మాజీ సైనికాధాకి లింగాల పాండురంగారెడ్డి ఆ పుస్తకం రాశారు. తెలంగాణ సెంటిమెంట్ తీవ్రతకు ఇందిరా గాంధీ కదిలిపోయారని ఆయన తన పుస్తకంలో రాశారు. 1979లో పిటిషన్ డ్రాపయిందని, ఈలోగా ఇందిరా గాంధీ తెలంగాణ నాయకులను పదవుల ద్వారా, ఇతర పద్ధతుల ద్వారా బుజ్జగిస్తూ వచ్చారని ఆయన రాశారు.
తెలంగాణ ప్రభావం తీవ్రంగా ఉంటూ వచ్చిందని, 1971 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి (టిపిఎస్) 14 స్థానాల్లో 10 లోకసభ స్థానాలు గెలుచుకుందని, తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను ఆకట్టుకోలేమని ఇందిరా గాంధీ భావించారని, దాంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నడుం బిగించారని, తెలంగాణ ఏర్పాటుకు కసరత్తు చేయాలని ఇందిరా గాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎన్ హస్కర్ను ఆదేశించారని ఆయన తన పుస్తకంలో రాశారు.
ఈలోగా అప్పటి విదేశీ వ్యవహారాల కార్యదర్శి టిఎన్ కౌల్ హైదరాబాద్ రాజ్యానికి సంబంధించిన కేసు ఐక్య రాజ్యసమితి వద్ద పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారని పాండురంగారెడ్డి తన పుస్తకంలో రాశాడు. ఈ విషయాన్ని కౌల్ తన జ్ఞాపకాల్లో రాసుకున్నారని కూడా ఆయన చెప్పారు.
పాండురంగారెడ్డి పుస్తకం ఇటీవల హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. ఈ పుస్తకాన్ని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఆవిష్కరించాల్సి ఉంది. అయితే, వీలు కాకపోవడంతో ఆయన రాలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పాండురంగా రెడ్డి అప్పటి తెలంగాణ ఉద్యమం గురించి ఈ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమాన్ని 1969లో అణచివేయడానికి వరంగల్లో నియోగించిన గూర్ఖా రైఫిల్స్ కమాండర్గా పాండురంగారెడ్డి వ్యవహరించారు. అప్పుడు వరంగల్లో కాల్పులు జరగకపోవడంపై అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన రాశారు. కాల్పులు జరపకుండా తాము పరిస్థితిని అదుపులో పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు. అది ఎలా సాధ్యమైందో కూడా ఆయన రాశారు.












Click it and Unblock the Notifications