కామాంధుల ముఠా: 600 కోట్ల టర్నోవర్, బయటపడిందిలా...
విజయవాడ: కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన ఓ మహిళా నేత ధైర్యం ప్రదర్శించి, చొరవ చూపడంతో కాల్ మనీ పేరుతో నడుస్తున్న కామాంధుల ముఠా గుట్టు రట్టయింది. ఆర్థికావసరాలను ఆసరా చేసుకుని మహిళలను లైంగికంగా వాడుకుంటున్న ఈ ముఠా అకస్మాత్తుగా వెలుగు చూసింది. ఈ ముఠా విజయవాడలో 600 కోట్ల టర్నోవర్ చేస్తున్నట్లు తేలింది.
పటమటకు చెందిన యలమంచిలి శ్రీరాముమూర్తి అలియాస్ రాము ఓ ప్రముఖ ఫైనాన్సియర్. కాల్మనీకి ఇస్తూ మరోవైపు పెద్ద మొత్తాల్లో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈయన బిఎండబ్ల్యూ కారు వాడుతున్నాడు. ఇతనికున్న బడా వ్యక్తులు, పోలీసులు, అధికారుల పరిచయాలతో అరాచక కార్యకలాపాలు గత చాలాకాలంగా కొనసాగిస్తున్నాడు.
పంటకాలువ రోడ్డులో రాము కార్యాలయం నిర్వహిస్తున్న బిల్డింగ్ యజమానిపై ఇతని అనుచరులు కొద్దిరోజుల క్రితం దాడికి పాల్పడ్డారు. ఓ గ్యాంగును నిర్వహిస్తున్న యలమంచిలి శ్రీను వద్ద బలమైన బౌన్సర్లు కూడా ఉన్నారు. దెబ్బలు తిన్న యజమాని శేషగిరిరావు పటమట పోలీసులను ఆశ్రయించగా ఇతనిపై రాము మనుషులే తిరిగి కౌంటర్ కేసు పెట్టారు. ఈవిషయం పోలీసుల దృష్టికి వచ్చింది.

ఈ నేపథ్యంలో యలమంచిలి రాము కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఈక్రమంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు కూడా సీపిని కలిసి ఫిర్యాదు చేశారు. కుమార్తె కాలేజీ సీటు, ఫీజు కోసం ఆశ్రయించగా ఆమెను ట్రాప్ చేయడంతోపాటు ఆ తర్వాత కుమార్తెను లొంగదీసుకుని లైంగిక చర్యలకు పాల్పడినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
ఈ రకంగా ఆర్ధిక సాయం, వడ్డీకి, కాల్మనీకి డబ్బు ఇస్తూ వీరి వద్దకు వచ్చే వారిని బలవంతంగా లోంగదీసుకుని వారిని స్టార్ హోటళ్ళకు తీసుకువచ్చి మద్యం తాగించి నగ్నంగా చిత్రీకరించడం, ఆపై తమ సిండికేట్ల వద్దకు పంపడం, రాజకీయనేతలు, ఉన్నతాధికారుల వద్దకు పంపి తమ వ్యక్తిగత పనులు చేయించుకోవడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతూ వస్తున్నారు.
దీంతో టాస్క్ఫోర్స్ ఏసిపిలు ప్రసాద్, మురళీధర్ నేతృత్వంలో ఎస్ఐలు సురేష్రెడ్డి, శ్రీనివాస్ల బృందం పక్కాగా రెక్కీ చేసి పలువురిని అదుపులోకి తీసుకుని రాకెట్ గుట్టు రట్టు చేశారు. నిందితుల్లో ఒకడైన వెనిగళ్ల శ్రీకాంత్ ఓ ఎమ్మెల్యేతో పాటు సింగపూర్లో ఉండడాన్ని బట్టి రాజకీయ నేతలకు, ముఠాకు మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెడుతోంది.
ముఠా బారిన దాదాపు 200 మంది మహిళలు పడినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలోని ఆరు మార్కెట్లలో ముఠా సభ్యులు వ్యాపారం చేస్తారని, వడ్డీ 20 నుంచి 25 రూపాయల వరకు ఇస్తారని అంటున్నారు. వారి లెక్కప్రకారం 20 రూపాయల వడ్డీ అయితే ఉదయం పూట 800 రూపాయలు ఇచ్చి సాయంత్రం పూట వేయి రూపాయలు వసూలు చేస్తారు. ఆటో నగర్లో ఈ వడ్డీ 30 రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. ఆటోనగర్లో రోజుకు వంద కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుందని అంచనా.
ఈ వ్యాపాం చేసే ఏ వ్యక్తి దాదాపు 300 కోట్ల రూపాయలు సంపాదించాడని అంటారు. అతను 60 నుంచి 70 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అప్పులు ఆస్తులు బలవంతంగా రిజిష్టర్ చేయించుకుంటారు. వాహనాలు సీజ్ చేస్తారు. లేదంటే భార్యలను, కూతుళ్లను పంపించాలని అడుగుతారు. అలా మహిళలు వారి బారిన పడిన దాఖలాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఇలా 30 మంది కాల్ మనీ వ్యాపారులు ఓ వ్యవస్థలా ఏర్పడి విజయవాడను శాసిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications