పళనిస్వామికి ముందున్న సవాళ్లు: శశికళపై వ్యతిరేకతే పన్నీరుకు బలం!
బల నిరూపణ కోసం పళనిస్వామి తమ ఎమ్మెల్యేలను సిద్ధం చేస్తుండగా.. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం మాత్రం రిసార్టు నుంచి బయటికొచ్చిన ఎమ్మెల్యేలపై దృష్టిసారించారు.
చెన్నై: తమిళనాడులో రాజకీయ సంక్షోభం ముగిసినప్పటికీ కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి బల నిరూపణ చేసుకునే వరకు ఉత్కంఠ మాత్రం కొనసానుంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు నమ్మకస్తుడైన పళనిస్వామి గురువారం సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
పళనిస్వామి తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించి..ఆమేరకు సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు కూడా. కాగా, ఇన్నాళ్లూ రిసార్ట్లో ఉన్న శాసనసభ్యులు గురువారం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తమ నివాసాలకు చేరుకుంటున్నారు.
కాగా, బల నిరూపణ కోసం పళనిస్వామి తమ ఎమ్మెల్యేలను సిద్ధం చేస్తుండగా.. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం మాత్రం రిసార్టు నుంచి బయటికొచ్చిన ఎమ్మెల్యేలపై దృష్టిసారించారు. నియోజకవర్గాల్లో ప్రజల మద్దతు పన్నీరుకు ఉండటంతో అదే అదనుగా వాడుకుని ఎమ్మెల్యేలను తన గూటికి రప్పించుకునేందుకు పన్నీరు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.
శశికళపై వ్యతిరేకతే పన్నీరుకు బలం అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పళనిస్వామి కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కసరత్తులు చేస్తూనే ఉన్నారు. పైచేయి పళనిస్వామిదా? లేక పన్నీరుదా అనే ఈ ఉత్కంఠకు శనివారం తెరపడనుంది.

రంగంలో పన్నీరు వర్గం
రిసార్టు నుంచి బయటికొచ్చిన ఎమ్మెల్యేలలో ఉన్న అసమ్మతులకు వల విసరడానికి పన్నీరుసెల్వం శిబిరం పావులు కదపడం ప్రారంభించింది. అందులో భాగంగా ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లోని ప్రజలనుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఈ దిశగా ఆయన వర్గం కార్యాచరణలోకి దిగింది. దాంతో ప్రజాభిప్రాయం పేరిట కొంతమంది శాసనసభ్యులు తమవైపునకు వచ్చేలా..ఓటింగు సమయంలో ఎడప్పాడికి ఓటు వేయకుండా నిరోధించేలా ఓపీఎస్ వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

శశికళపై ప్రజాగ్రహం..
రిసార్టు నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్యేలపై కొంతమంది గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వారంతా ఎమ్మెల్యేల వాహనాలను అడ్డుకున్నారు. కొంతమంది కార్యకర్తలు వారి కార్లపై ఉమ్మివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శశికళ వర్గానికి మద్దతిస్తున్న శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎడప్పాడి వర్గం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. పన్నీరు వర్గీయులు కావాలనే ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు.

బల నిరూపణకు పళనిస్వామి కసరత్తు
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎడప్పాడి పళనిస్వామి శాసనసభలో బలం నిరూపించుకునే క్రమంలో వ్యూహరచన ప్రారంభించారు. మొత్తం అన్నాడీఎంకే 134 మంది శాసనసభ్యుల్లో దేవర్లు 20, గౌండర్లు 28, వన్నియర్లు 19, దళిత సామాజిక వర్గానికి చెందినవారు 31 మంది ఉన్నారు. జయ, పన్నీరు మంత్రివర్గంలో దేవర్లు 12 మంది మంత్రులుగా ఉండేవారు. ఇప్పుడు కొత్త మంత్రివర్గంలోనూ వారి సంఖ్య 11గా ఉంది. అయితే.. పన్నీరుసెల్వం దేవర్ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆవర్గం ఎమ్మెల్యేలలో చీలిక వస్తుందని భావించారు. అయితే శశికళ కూడా అదే వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనవైపు ఈ వర్గం ఎమ్మెల్యేలు వెళ్లే సూచనలు కనిపించడం లేదు.

వర్గపోరు: షణ్ముఖం నివాసంపై దాడి
మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, మంత్రి సీవీ షణ్ముఖం మద్దతుదారుల మధ్య తలెత్తిన ఘర్షణ చెన్నైలోని గ్రీన్వేస్ రోడ్డులో ఉద్రిక్తతకు దారి తీసింది. గుర్తుతెలియని కొందరు రాళ్లు రువ్వడంతో పన్నీరు మద్దతుదారులు గాయపడగా సీవీ షణ్ముఖం నివాసంపై మరికొందరు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, గ్రీన్వేస్ రోడ్డులో పన్నీరుసెల్వం నివాసంతో పాటు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముఖం, ఇతర మంత్రుల నివాసాలూ ఉన్నాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications