నా చావుచూసి ఆ లెక్చరర్లు సంతోషిస్తారు..సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య!
పాఠం చెప్పవలసిన లెక్చరర్లు ఆమె పాలిట యమకింకరులు అయ్యారు. తప్పుదారిలో ఉంటే మంచి దారిలోకి మార్చి సరిదిద్దాల్సిన అధ్యాపకులు ఆ విద్యార్థినిని తిరిగి రాని లోకాలకు వెళ్ళేలా చేశారు. సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టారు. అందరు విద్యార్థుల ముందు దారుణంగా అవమానించారు. ఆ అవమానాలను భరించలేక, ఆత్మాభిమానం చంపుకోలేకపోయిన యువతీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
బీటెక్ సెకండియర్ విద్యార్థిని సూసైడ్
హైదరాబాద్ మణికొండలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటున్న శ్రేయ అనే విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇబ్రహీంబాగ్ లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న శ్రేయ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో నిర్వహించిన పరీక్షల్లో పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్ తీసుకు వెళ్లడంతో ఆమెను అప్పుడు పరీక్షల నుండి డిబార్ చేశారు.

కళాశాలలో లెక్చరర్ ల వేధింపులతో సూసైడ్
అయితే ఈ ఘటనతో సమస్య ముగిసిపోలేదు. సెకండ్ ఇయర్లోకి వెళ్లిన ఆమెను కళాశాలలోని లెక్చరర్లు పదేపదే టార్గెట్ చేస్తున్నారు. నీకు సిగ్గు, శరం ఉండవు.. కొన్ని జీవితాలు ఎప్పటికీ మారవు వంటి మాటలతో ఆమెను చిత్రవధకు గురి చేస్తున్నారు. ఎగ్జామ్స్ లో నువ్వు దొరుకుతావు అనుకుంటే వేరే వాళ్ళు దొరికారని ఒక లెక్చరర్ మాట్లాడుతుందని వాళ్ళ మాటలు భరించలేక సూసైడ్ చేసుకుంటున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.
నా చావు చూసి వాళ్ళు సంతోషపడతారని నోట్
అందులోనే తాను సూసైడ్ చేసుకున్నట్టు ఆ లెక్చరర్ లకు తెలియనివ్వకండి.. నా చావు చూసి వాళ్ళు బాధ పడరు.. సంతోష పడతారు అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. అమ్మా నాన్న నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ప్రాణం తీసుకుంది. కూతురు చేసిన పనికి తల్లిదండ్రులు గుండెలవిసిపోయేలా రోదిస్తున్నారు.
కేసు నమోదు, పోలీసుల దర్యాప్తు
తమ కుమార్తె మరణానికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్, తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications