హోదాపై చంద్రబాబు డైలమా: ఏం చేయడం?
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సమస్యను పరిష్కరించే విషయంలో ఏం చేయాలనే డైలమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పడినట్లు తెలుస్తోంది. కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరించడం కాస్తా కష్టమే అయినప్పటికీ ఏదో విధంగా బయటపడాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ప్రకటన ఎపికి వర్తించదని చంద్రబాబు చెబుతున్నప్పటికీ అది నమ్మే విషయంగా కనిపించడం లేదు. ఎపికి ప్రత్యేక హోదా రాదనే విషయం దాదాపుగా స్పష్టమైనట్లే. ఈ స్థితిలో బిజెపితో స్నేహం చెడకుండా వ్యవహరిస్తూ తమ ప్రయత్నాలు తాము చేశామని అనిపించుకోవడం ఎలా అనే విషయంలో చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు.
ప్రత్యేక హోదా విషయంపై కేంద్రానికి విజ్ఝప్తి చేసి, విషయం చెప్పి అవసరమైతే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలన్న ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా సాధ్యపడకపోతే ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీలను ఏదైనా ప్యాకేజీ పేరుతో సాధించాలనే వ్యూహం కూడా ఉంది. చంద్రబాబు దీనికే ప్రాధాన్యం ఇచ్చేట్లు కనిపిస్తున్నారు.

విదేశాల నుంచి తెచ్చుకొనే రుణాల్లో 70 శాతం గ్రాంటుగా ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించగలిగితే రాష్ట్రానికి భారీ ప్రయోజనం చేకూరుతుందన్న అంచనాలో టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. రఘరామ రాజన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు పెద్ద ఆటంకంగా మారింది. దేశంలో ఇక ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది.
రఘురామ రాజన్ కమిటీ రాష్ట్రం విడిపోక ముందు వేసింది కాబట్టి అది తమకు వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ అందులో పస లేదనే విషయం పెద్దలకు తెలుసునని అంటున్నారు. దీంతో కేంద్రంలోని పెద్దలకు ముందుగా చెప్పి వారి ఆమోదం తీసుకొన్న తర్వాత కోర్టుకు వెళ్ళడం సరైందని భావిస్తున్నారు. దానివల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గుముఖం పడుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications