చంద్రబాబు అనుభవం: జగన్ అపరిపక్వత
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు, సామర్థ్యం, ప్రజా విశ్వాసం మాట ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అనుభవం ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అపరిపక్వత ఓడిపోయింది. జగన్ అతి విశ్వాసం చంద్రబాబు వ్యూహం ముందు వీగిపోయింది. అనుభవానికి, అనుభవరాహిత్యానికి మధ్య పోటీగా సీమాంధ్ర ఎన్నికలు జరిగాయి.
విజయానికి తోడ్పడతుందని భావించిన ఓ ఒక్క అంశాన్ని కూడా చంద్రబాబు విస్మరించలేదు. జగన్ ఆ దిశగానే ఆలోచన చేయలేదు, తమ పార్టీ తరఫున పోటీ చేయడం అభ్యర్థుల అదృష్టంగా, ఓట్లు వేయడం ప్రజల కర్తవ్యంగా భావించారు. చంద్రబాబు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని ఉపయోగించుకుంటే, జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రజలకు ఉన్న ఆదరణే సరిపోతుందని భావించారు.
ప్రమాదాన్ని పసిగట్టి చంద్రబాబు భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకున్నారు. బిజెపితో పొత్తును సొంత పార్టీకి చెందినవారు కూడా ఇష్టపడలేదు. బిజెపి తెలంగాణా శాఖ అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి లాంటి వ్యక్తులు నిరసించినా చంద్రబాబు పట్టించుకోలేదు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలిని చంద్రబాబు ముందుగానే అంచనా వేసి ఎవరు కాదన్నా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు సందర్భంగా తెలంగాణ, సీమాంధ్రలో బిజెపి నేతలు ఎంత ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు సహించారు.
మధ్యలో సినీనటుడు పవన్కల్యాణ్ జనసేన పేరుతో పార్టీ పెడితే ఆయనతో రాయబారాలు నడిపారు. అయితే, పవన్ తన పార్టీ తరపున అభ్యర్ధులను దించకుండా బిజెపికి మద్దతు ఇస్తానని ప్రకటించి, బిజెపి అభ్యర్ధులకు మాత్రమే ప్రచారానికి వస్తానని ప్రకటించారు. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన తర్వాత కూడా పవన్ టీడీపీ అభ్యర్దులకు ప్రచారం చేయటానికి ఇష్టపడలేదు. దాంతో ఈ విషయాన్ని చంద్రబాబు మోడీతో చర్చించి ఆయన ద్వారా పవన్కు మాట్లాడించారు. చివరకు టిడిపి అభ్యర్ధులకు కూడా ప్రచారం చేయటానికి పవన్తో చంద్రబాబు ఒప్పించారు. అందుకు పవన్ ఇంటికి స్వయంగా చంద్రబాబే వెళ్ళి దాదాపు గంటసేపు మంతనాలు జరిపారు.
చంద్రబాబు ఎక్కువగా సీమాంధ్రలోనే మోడీ, పవన్ కళ్యాణ్లను బహిరంగసభల్లో పాల్గొనేట్లు చేశారు. దాంతో సహజంగానే దేశవ్యప్తంగా ఉన్న బిజెపి గాలికి వపన్ తెచ్చిన ఊపు టిడిపికి కలిసివచ్చింది. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్పై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఆధారం చేసుకుని కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరిన పలువురికి టిక్కెట్లు ఇచ్చి పోటీలో నిలబెట్టటం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది.
చంద్రబాబుకు విరుద్దంగా జగన్మోహన్రెడ్డి వ్యవహరించారు. ఆ పార్టీలో జగన్తో పాటు తల్లి, చెల్లి తప్ప ప్రచారానికి మరొకరు లేరు. వీరంతా గడచిన నాలుగేళ్ళుగా చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఎన్నికల సమయంలో వీరు చేసిన విమర్శల్లో కొత్త దనం ఏమీ కనబడలేదు. జగన్ బెయిల్, జైలు, ఆర్దిక అక్రమాలు తదితరాలు ప్రజల్లో బలంగా నాటుకుని పోయేలా చంద్రబాబు, పవన్లతో చెప్పించారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్లో చేసిన అభివృద్దిని కళ్ళారా చూసిన ఎంతో మంది మళ్ళీ చంద్రబాబు వస్తేనే కొత్త రాజధాని త్వరగా ఏర్పాటు చేసుకోవచ్చని జరిగిన ప్రచారం ప్రజల్లో బాగా నాటుకుపోయింది.