బాబుకు మోడీ మరో షాక్: కారణాలు చెప్పిన కేంద్రం..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో షాకిచ్చింది. ప్రత్యేక హోదా పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు గంటా ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు.
భేటీ ముగిసిన తర్వాత ఒకింత ఆత్మవిశ్వాసంతోనే చంద్రబాబు బయటకు వచ్చారు. అదే సమయంలో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వ పథకం 'అమృత్' పథకం కింద అందే ప్రయోజనాలేమీ ఇప్పుడప్పుడే దక్కేలా లేవని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు బాంబు పేల్చాయి.
అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ సర్కారు.. సొంతంగా రాజధానిని నిర్మించుకునే పరిస్థితి లేదు. అవకాశం ఉన్న అన్ని మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకుంటున్న చంద్రబాబు సర్కారు రాజధాని నిర్మాణం దిశగా వడివడిగానే అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో కనీసం 'అమృత్' పథకం కింద అందే నిధులైనా వస్తే.. కనీసం మౌలిక సదుపాయాలకైనా నిధులు సమకూరుతాయన్న భావనతో ఏపీ ప్రభుత్వం ఉంది. అయితే ఈ పథకం కింద వివిధ నగరాలు, పట్టణాలకు అందే నిధులు అమరావతికి సమీప భవిష్యత్తులో అందే అవకాశాలే లేవని కేంద్రం తెలిపింది.
ఇందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు కారణాల చిట్టానే విప్పారు. ఈ చిట్టాలో పలు కారణాలు ఉన్నాయి. అమరావతి పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ రాజధాని. ప్రస్తుతం అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. అమరావతికి భౌగోళిక సరిహద్దులు పూర్తి కాలేదు. రాజధానిలో జనాభా సంఖ్యపై పూర్తి వివరాలు లేవు. జనాభా వివరాల్లేనప్పుడు మౌలిక సదుపాయాల అంచనా కష్టం. రాజధానిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం నిధులు. గ్రాంట్లు ఇస్తోంది. అమరావతిని ప్రత్యేక మునిసిపాలిటీ లేదా నగరంగా ఇంకా ప్రకటించలేదు.