బుల్లెట్ రైలెక్కిన బాబు, అమరావతి-హైద్రాబాద్ మధ్య..
బీజింగ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు బుల్లెట్ రైలులో ప్రయాణించారు. నూటా నలభై కిలోమీటర్ల దూరం అరగంటలో బుల్లెట్ రైలులో ప్రయాణించి ఆస్వాదించారు. బుల్లెట్ రైలు వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు తన బృందంతో కలిసి ఆయన ప్రయాణం చేశారు.
టియాంజిన్ నుంచి బీజింగ్ వెళ్లారు. అక్కడ చైనా రైల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. బుల్లెట్ రైళ్లు గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఈ సందర్భంగా అమరావతి - విశాఖ, అమరావతి - హైదరాబాద్ మధ్య బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశ పెట్టే అవకాశాలపై చర్చించారు.
అనంతరం చంద్రబాబు గుయాన్ చేరుకున్నారు. వాతావరణం అనుకూలించక పోవడంతో విమాన ప్రయాణం ఏడున్నర గంటలు ఆలస్యమైంది. దాంతో కొన్ని కార్యక్రమాలు రద్దయ్యాయి. బుల్లెట్ రైలు ప్రయాణంపై చంద్రబాబు ట్వీట్ కూడా చేశారు. ఎప్పటికి గుర్తుండిపోయేది అన్నారు.
Elated at the experience of travelling in a Bullet train from Tianjin to Beijing. A memorable experience. #ChinaTrip pic.twitter.com/flyZtuJ80H
— N Chandrababu Naidu (@ncbn) June 28, 2016
కాగా, ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అప్పో మొబైల్ ఉత్పత్తుల సంస్థ సంసిద్ధత తెలియజేసింది. 25వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అప్పో ప్రతినిధులు తెలిపారు. అనంతరం ఇంజో ప్రావిన్స్ వైస్ గవర్నర్ క్విన్రూపీతో సీఎం బృందం భేటీ అయింది. ఇంజో ప్రావిన్స్ హరితావరణాన్ని ప్రశంసించిన చంద్రబాబు.. మీ రాష్ట్రంలో ఆకుపచ్చ లోకాన్ని సృష్టించారని, మీ అనుభవాలను మాతో పంచుకోవాలని కోరారు.
ఏపీని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో నీరు-చెట్టు అంశంలో కఠిన నిబంధనలు ఉన్నాయని చెప్పిన క్విన్ రూపీ పర్యావరణ పరిరక్షణకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు.
అనంతరం అప్పో మొబైల్ ఉత్పత్తుల సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఇరిక్, ఎండి జోన్, ప్లానింగ్ డైరెక్టర్ స్పెటర్తో చంద్రబాబు భేటీ అయ్యారు. భారత్లో హార్డ్వేర్కు ఎంతో డిమాండ్ ఉందని వివరించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ పరిపాలనలో ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటంలో తాము ముందున్నట్లు తెలిపారు.
పరిపాలన, అభివృద్ధికి సంబంధించి తాజా సమాచారంతో కూడిన కోర్ డ్యాష్ బోర్డు విశేషాలను మొబైల్ కంపెనీ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ఎలా అప్లోడ్ చేస్తారో వివరించిన చంద్రబాబు, మరింత సమాచారం అప్డేట్ చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)ను ఉపయోగించుకుంటున్నట్లు వెల్లడించారు.