వైయస్ని మెచ్చుకొని, జగన్పై చంద్రబాబు ఆగ్రహం
విజయవాడ: వైయస్ రాజశేఖర రెడ్డిని, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని పోలుస్తూ ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన బిగ్ డిబేట్లో మాట్లాడారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వంటి వాళ్లు జీవితంలో ఒక పద్ధతిలో ఉండేవాళ్లని, కానీ ఆయన కొడుకు జగన్ మాత్రం పద్ధతిలేని వ్యక్తి అని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడినా వృథానే అని, అయినా ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి గౌరవిస్తానన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వేరు, జగన్ వేరని చెప్పారు.
తనకు కులాన్ని అంటగట్టడం పైన కూడా చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. రాజధాని అమరావతిలో పెట్టడాన్ని కొందరు వ్యతిరేకించారని, అది కుదరక కోర్టుకు వెళ్లారని, దీంతో తనకు కులమతాలను అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తనకు కులమతాలు లేవన్నారు.
పాలనలో తనకు మొదటి నుంచి ప్రత్యేకత ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు చెప్పేది చెబుతున్నారని, వాళ్లు చెప్పిన వాటిల్లో మంచిని తాను తీసుకుంటున్నానని, అలా కాకుండా విలువ లేనివి చెబితే నా విధానంలో నేను వెళ్తున్నానని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రతి దానికి అడ్డం పడితే తాను వేరే పద్ధతిలో ముందుకెళ్తానన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీయే సర్వస్వం కాదన్నారు. అదే సమయంలో మెరుగైన పాలన, సమస్యల పరిష్కారం, అభివృద్ధికి టెక్నాలజీని ఉపయోగించుకుంటామన్నారు. ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమంలో ఏపీలోని పలు ప్రాంతాల నుంచి సామాన్యులు ఫోన్ చేసి పలు సమస్యలపై నేరుగా ప్రశ్నించారు.