లోకేష్ నుంచి పార్టీ బాధ్యతలు లాగేసిన బాబు: ఎందుకు?
చంద్రబాబు నాయుడు టిడిపి బాధ్యతలను నారా లోకేష్ నుంచి తీసేసుకున్నారు. మంత్రి పదవి చేపట్టిన లోకేష్ నుంచి ఆ బాధ్యతలు ఎందుకు తీసుకున్నారనేది చర్చ....
విజయవాడ: పార్టీ బాధ్యతలను తెలుగుదేశం పార్టీ (టిడిపి) చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాగేసుకున్నారు. మంత్రి కాక ముందు పార్టీ వ్యవహారాలను నారా లోకేష్ చూస్తూ ఉండేవారు. అకస్మాత్తుగా చంద్రబాబు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
అయితే, నారా లోకేష్ ఒక్కడినే పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తే మరో అర్థం తీసే అవకాశం ఉందనే ఉద్దేశంతో కళా వెంకట్రావు నుంచి కూడా పార్టీ బాధ్యతలను తాను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ టీడిపి అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు కూడా మంత్రి పదవిని చేపట్టారు.
చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమైంది. శుక్రవారంనాడు ఆయన చేసిన ప్రకటన ఈ విషయాన్ని తెలియజేస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కుదురుకోక ముందే ఎన్నికలు నిర్వహిస్తే తమకు ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటున్నట్లున్నారు. శుక్రవారం రోజున విజయవాడలోని తన నివాసంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో జరిగిన సమన్వయ సమావేశంలో చంద్రబాబు పలు విషయాల గురించి మాట్లాడారు.

అసలు చంద్రబాబు ఏమన్నారు...
నారా లోకేశ్, కళావెంకట్రావు మంత్రులు కావడం వల్ల ఇంతకు ముందు లాగా పార్టీ పని చూడలేరని, ఇకపై పార్టీ పనులన్నీ తానే చూస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి రెండు మూడు గంటలపాటు పార్టీ వ్యవహారాలపైనే దృష్టి పెడతానని కూడా చెప్పారు. వారంలో కనీసం ఐదు రోజులు దీన్ని పాటిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన మంత్రులు సీనియర్లను, ఇతరులను కలుపుకొని వెళ్లాలని కూడా సూచించారు.

వారసుల పట్ల జాగ్రత్తగా...
ఎన్నికలకు ముచ్చుకొస్తుండడంతో మంత్రులకు చంద్రబాబు ఓ సూచన చేశారు. మంత్రులు తమ కుటుంబ సభ్యులు, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వారి వల్ల చెడు పేరు రాకుండా చూసుకోవాలని ఆయన చెప్పారు. వారసులు రాజకీయాల్లోకి రావలసిందే, తప్పు లేదు గానీ వారి వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదని చెప్పారు. "మీ పదవులను అడ్డుపెట్టుకుని వారు తప్పులు చేసినా.. మీ అధికారాన్ని వారు దుర్వినియోగం చేసినా పార్టీ నష్టపోతుంద"ని ఆయన అన్నారు. తనకు కొందరి గురించి సమాచారం వస్తోందని, దానిని సరిదిద్దుకోవాలని, లేకపోతే సహించబోనని ఆయన హెచ్చరించారు.

ఏమిటీ పొగడ్తలని విసుక్కున్న బాబు
నారా లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారని, పనులు వేగంగా అవుతున్నాయని కొద్ది మంత్రులు అన్నారని, దాన్ని చంద్రబాబు మధ్యలోనే తుంచివేశారని అంటున్నారు. ప్రశంసలు వద్దు పనులు కావాలని ఆయన అన్నారు.అన్ని శాఖలూ బాగా పనిచేస్తే ప్రజలు సంతోషిస్తారని ఆయన అన్నారు.

ఎమ్మెల్యేలు ఎందుకు వస్తున్నారని...
మూడు రోజుల క్రితం విజయనగరం జిల్లా నుంచి మన ఎమ్మెల్యేలు ముగ్గురు తన వద్దకు వచ్చారని, ఆ సమయంలో తాను టీవీ చూస్తున్నానని, విజయనగరంలో జడ్పీ సమావేశం చూపిస్తున్నారని, మంత్రి సుజయ కృష్ణ రంగారావు అందులో పాల్గొన్నారని, జడ్పీ సమావేశం జరుగుతుంటే దానిని వదిలిపెట్టి ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చారని చంద్రబాబు గుర్తు చేసినట్లు సమాచారం. సమావేశం వదిలేసి ఎమ్మెల్యేలు తన వద్దకు రావడమేమిటని ఆయన విసుక్కున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications