చెన్నైవరద: విశాల్, సిద్ధార్థ.. రీల్ హీరోలేకాదు(పిక్చర్స్)
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షాలు, వరద ముంచెత్తాయి. ప్రజలు రోజుల తరబడి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి నటులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారు. విశాల్, సిద్ధార్థ్, ఖుష్బూ, కార్తి తదితరులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
దీంతో వారు తాము రీల్ హీరోలం మాత్రమే కాదని.. రియల్ హీరోలం అని నిరూపించారు. ఓ సమయంలో నటుడు విశాల్ బాధితుల కష్టాలను చూసి కంటతడి పెట్టారు. నటులు రజనీకాంత్, ఆయన భార్య లతా రజనీకాంత్, సిద్ధార్థ్ రాఘవ లారెన్స్, సూర్య, కార్తి, విశాల్, ధనుష్లు తదితరులు సీఎం సహాయ నిధికి లక్షలు, కోట్లు ఇచ్చారు.
విశాల్, కార్తి, సిద్ధార్థ్ వంటి వారు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు సహకరిస్తూ, విలువైన సేవలందిస్తూ, బాధితుల ఆకలి తీర్చుతూ వారి ప్రేమకు పాత్రులవుతున్నారు. నటుడు విశాల్ ఆరు రోజులుగా బాధిత ప్రజల సేవలోనే ఉన్నారు. ఇందుకోసం ఆయన ఓ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి ఆ సభ్యులందరి ఇళ్లలోనూ వంటలు చేసి వాటిని ఒక్కో ప్రాంతానికి వాహనాల్లో తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు.
విశాల్
శనివారం విశాల్ బృందంలో ఏకంగా 50 మందికిపైగా చేరి నగరవ్యాప్తంగా ఆహారపొట్లాలు, తాగునీరు, రొట్టెలు అందజేశారు. విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. జనం ఆవేదన గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
విశాల్
అన్ని ప్రాంతాలు చక్కబడేంతవరకు షూటింగ్లను పక్కనబెట్టి సహాయసహకారాలు అందజేస్తామని విశాల్ తెలిపారు.
ఖుష్బూ
వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నైలో బాధితులను ఆదుకునేందుకు సినీ నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ కృషి చేస్తున్నారు. మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు.
సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ కూడా ఆరు రోజులగా బాధితులకు సహాయం చేస్తున్నారు. నటుడు సిద్ధార్థ్ ఇల్లు కూడా వరద నీటిలో మునిగింది.
చెన్నై వరదలు
నటుడు కార్తి, నటి కోవై సరళ, ఇతర నటులు కూడా ఆహార ప్యాకెట్లను ఇంటింటికీ అందజేస్తున్నారు. ఓ పాఠశాలలో ఉన్న నిరాశ్రయులకు ఆహారంతోపాటు దుస్తులు పంపిణీ చేశారు.
చెన్నై వరదలు
హాస్యనటుడు మయిల్ స్వామి నివసిస్తున్న సాలిగ్రామం ప్రాంతం నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. ఆయన ఈ ప్రాంతాల్లోని బాధిత ప్రజల కోసం ప్రత్యేకించి ఓ పడవ తీసుకుని అందులోనే ప్రయాణిస్తూ ఆహారం అందజేశారు.
చెన్నై వరదలు
బిగ్ఎఫ్ఎం రేడియో జాకీ, నటుడు బాలాజీ కూడా నుంగంబాక్కం ప్రాంత బాధితులకు తనవంతు సహాయపడ్డారు. ఇతను రూ.కోటి విరాళం ప్రకటించారు.
నటీనటుల ఆర్థిక సాయం
వరద బాధిత ప్రాంతాల కోసం పలువురు నటులు విరాళాలు ప్రకటించారు. సూపర్స్టార్ రజనీకాంత్ రూ.10 లక్షలు, ఆయన భార్య లతారజనీకాంత్ రూ.60 లక్షలు ఇచ్చారు. నటుడు విజయ్ రూ.5 కోట్లు, రాఘవ లారెన్స్ రూ.కోటి ప్రకటించారు.
నటీనటుల ఆర్థిక సాయం
నటులు సూర్య, కార్తి కుటుంబం ఇప్పటికే రూ.25లక్షలు, ధనుష్ రూ.5 లక్షలు, శివ కార్తికేయన్ రూ.5 లక్షలు, విశాల్ రూ.5 లక్షల చెక్ను సీఎం సహాయనిధికి ఇచ్చారు. నటుడు పార్తిబన్ రూ.2 లక్షలు, హాస్యనటుడు సంతానం రూ.5 లక్షలు, సిద్ధార్థ్ రూ.కోటి, నటుడు ఆర్జే బాలాజీ రూ.కోటి విరాళాలుగా ప్రకటించారు.