చంద్రబాబు హెచ్చరికలతో.. తెలుగు తమ్ముళ్లలో మొదలైన వణుకు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన హెచ్చరికలతో తెలుగు తమ్ముళ్లు.. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న నేతల్లో గుబులు మొదలైంది.
టీడీపీ అధినేత జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో తామెప్పుడైనా, ఎక్కడైనా.. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశామా? ఏ సందర్భంలోనైనా, ముఖ్యంగా పార్టీ నేతలవద్ద పార్టీ గురించిగాని, ముఖ్యమంత్రి గురించిగాని చులకనగా మాట్లాడామా? అనే తర్జన భర్జనల్లో పడిపోయారు.
తెలుగు తమ్ముళ్లలో మార్పు...
టీడీపీ నేతలు ఇంతగా సింహావలోకనంలో పడిపోవడానికి కారణమేంటి? ‘అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందిగా, ఈలోపు ఎంతో కొంత పనిచేసి.. ప్రజలను మావైపు తిప్పుకోవచ్చులే..' అని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన నేతల్లో ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తోంది. తెలుగు తమ్ముళ్లలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలే.
Recommended Video
ఎవరెవరు ఏమేం చేస్తున్నారో...
తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎవరు ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అన్నీ తనకు తెలుసునని, వారందరి తప్పులనూ తాను చిత్రగుప్తుడి చిట్టా మాదిరిగా రాస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల హెచ్చరికలు చేయడమే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు వణుకు పుట్టడానికి కారణం.
సిట్టింగ్ ఎమ్మెల్యేలే టార్గెట్...
‘పార్టీ నేతలు మారాలి.. మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో నిత్యం పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలి. ప్రజల సమస్యలను పరిష్కరించాలి..' అంటూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే కిందిస్థాయి నేతలకు నూరిపోస్తున్నా.. దానిని ఆచరణలో పెడుతున్న తమ్ముళ్ల సంఖ్య తక్కువే.
దారికి తీసుకొస్తా.. పనిచేయిస్తా...
‘కొందరు మారేందుకు ఆసక్తి చూపించడం లేదు.. వారిని ఏ విధంగా దారికి తీసుకురావాలో, వారితో ఎలా పనిచేయించాలో నాకు బాగా తెలుసు.. అధికారుల వెంటబడి మరీ పని చేయిస్తా..' అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ‘గుమ్మడికాయ దొంగ' చందంలా భుజాలు తడుముకుంటున్నారు.
టార్గెట్ మనమే...
టీడీపీ అధినేత చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని టార్గెట్ చేస్తూ ఇటీవల చేసిన ఆ వ్యాఖ్యలు నిజానికి వారి గురించి కాదని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సరిగా పనిచేయని తమలాంటి నేతలను ఉద్దేశించే ఆయన అలా హెచ్చరించారని ఎవరికి వారే గుసగుసలాడుకుంటున్నారు.