జగన్కు ధమ్కీ: టిడిపిలోకి ముగ్గురు ఎంపీలు?
న్యూఢిల్లీ: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం తీర్థం తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. పార్టీ మారితే లోక్సభ సభ్యత్వాలకు ఇబ్బంది లేకుండా న్యాయ నిపుణులు, సీనియర్ రాజకీయ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఎంపీ ఒకరు తెలుగుదేశం రాజ్యసభ పక్ష ఉప నేత సిఎం రమేష్ నివాసంలో గురువారం మధ్యాహ్నం సమావేశమై టిడిపిలో చేరే అంశంపై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది.
అరకు ఎంపీ కె గీత, కర్నూలు ఎంపీ రేణుక సహా మరో ఎంపీ తెలుగుదేశంలో చేరవచ్చునని ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లోక్సభలో ఎనిమిది మంది సభ్యులుంటే, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇప్పటికే టిడిపిలో చేరారు. అయితే, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఎస్పీవై సభ్యత్వం రద్దు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు లేఖ రాయటం తెలసిందే. లోక్సభలో వైయస్సార్ కాంగ్రెసు పక్ష నాయకుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎంపీలు ఇటీవల సుమిత్రా మహాజన్ను కలిసి ఎస్పీవైపై చర్య తీసుకోవాలంటూ వినతిపత్రం అందించారు.
బుట్టా రేణుక గతంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్టే చేరి వెనక్కితగ్గారు. అయితే ఆమె భర్త మాత్రం తెలుగుదేశంలోనే ఉండిపోయారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కలిసికట్టుగా బయటకు వెళ్లిపోతే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. అందుకే గీత, రేణుక సహా మరో ఎంపీ వైయస్సార్ కాంగ్రెసు నుంచి తప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఒకరు వారికి సహాయం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.
న్యాయ నిపుణులతో చర్చలు పూర్తయిన వెంటనే ముగ్గురు ఎంపీలు టిడిపిలో చేరిపోతారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విపక్షనేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కారణంగానే టిడిపిలో చేరాలని వీరు అనుకుంటున్నట్టు చెబుతున్నారు.
జగన్మోహన్రెడ్డి తమ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రత్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నారు గానీ తమను పట్టించుకోవటం లేదన్నది వీరి వాదన. అందుకే తాము తెలుగుదేశం పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్టు చెబుకుంటున్నారు.