జగన్, కెసిఆర్..: కాంగ్రెస్ ఆశలు దక్షిణాది పైనే
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ రెండు పర్యాయాలు అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కారణం. రాష్ట్ర విభజన ద్వారా మరోసారి ఎపిలో ఎక్కువ స్థానాల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని అధికార పార్టీ భావిస్తోందట. యూపిఏ-3 ఏర్పాటుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్పైనే ఆశలు పెట్టుకుందట. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరేడు లోక్సభ స్థానాలకు మించి రావని సర్వేలు చెబుతున్నాయి.
అయితే, రాబోయే ఎన్నికల్లో మళ్లీ 30 నుంచి 35 సీట్లను దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర విభజనకు తెర తీసిందంటున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించిన తర్వాత తెరాసను పార్టీలో విలీనం చేసుకోవాలని, తద్వారా తెలంగాణ ప్రాంతంలో 15కు తక్కువ కాకుండా సీట్లను సాధించాలని కాంగ్రెస్ ఎత్తు వేసిందంటున్నారు. ఇక రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే మొగ్గు ఉంటుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.

కాంగ్రెస్కు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కలిపి కనీసం 15 నుంచి 20 సీట్లు ఖాయమని కూడా అంచనా వేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తద్వారా రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లోనూ 30 నుంచి 35 సీట్లు తమకు ఖాయమని కాంగ్రెసు పార్టీ భావిస్తోందట. అదే సమయంలో దక్షిణాదిలోని కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది.
ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రోజురోజుకు పట్టు పెంచుకుంటున్నారని, లోక్సభ ఎన్నికల్లో తమకు కనీసం 15 సీట్లు ఖాయమని అంచనా వేస్తోంది. కేరళలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. కేరళ, తమిళనాడు కలిపి మరో ఐదారు స్థానాలు వస్తాయని అంచనా వేస్తోంది. వెరసి దక్షిణాదిలో తమకు ఎప్పట్లాగే 50 లోక్సభ స్థానాలు ఖాయంగా వస్తాయని కాంగ్రెస్ వ్యూహకర్తలు స్పష్టం చేస్తున్నారు.
ఇక దక్షిణాది మినహా దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలన్నిటిలోనూ కలిపి మరో వంద సీట్లను సాధించినా యూపిఏ-3 ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదని కూడా వివరిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటు దక్షిణాదిలోనూ, అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ బిజెపి బలం అంతగా ఉండదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో టిడిపితో పొత్తు పెట్టుకున్నా రెండు పార్టీలకూ కలిపి పదిలోపు సీట్లు మాత్రమే వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోందట.
కేరళ, తమిళనాడులలో అయితే బిజెపి బోణీ కూడా చేయలేదని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో బిజెపి, దాని మిత్రపక్షాలకు తక్కువ సీట్లు మాత్రమే వస్తాయని భావిస్తోందట. ఇక ఉత్తరాదిలో మోడీ ప్రాబల్యం ఉందనుకున్నా ఆ పార్టీకి 160-170 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేస్తోంది. ప్రస్తుత సంకీర్ణ యుగంలో 2014 ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషిస్తాయని కాంగ్రెస్ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications