తమిళనాడు కోపంగా ఉంది, ఎన్నిక మళ్లీ: కమల్ సంచలన వ్యాఖ్యలు
గత అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గెలిచినప్పటికీ, ఆ ఫలితాన్ని తాను అంగీకరించబోవడం లేదని కమల్హాసన్ వ్యాఖ్యానించారు.
చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత మరణం నాటి నుంచి తమిళనాడులో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై ప్రముఖ సినీనటుడు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆమె ప్రతిపాదించిన పళనిస్వామి తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ప్రజలు, సినీ ప్రముఖుల మద్దతు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో ఓడిపోయారు.
ఈ క్రమంలో కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు.
గత అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గెలిచినప్పటికీ, ఆ ఫలితాన్ని తాను అంగీకరించబోవడం లేదని కమల్హాసన్ వ్యాఖ్యానించారు. ప్రజల మనోభావాలు వేరేగా ఉన్నాయన్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదో నేరస్తుల ముఠా
‘శశికళను సుప్రీంకోర్టు దోషిగా తేల్చడంతో ఆమె కుటుంబసభ్యులంతా కలసి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా నిలబెట్టారు. అదో నేరస్తుల గుంపు' అని ఆయన అభివర్ణించారు. ‘నేను చెప్పేది నిజం. న్యాయస్థానం కూడా అదే పునరుద్ఘాటించింది. దివంగత సీఎం జయలలితపై కూడా నేరారోపణ జరిగింది' అని పేర్కొన్నారు. ‘అసెంబ్లీని శుద్ధి చేయాలి ఎన్నికలు జరిపించండి. వాళ్లే నిర్ణయిస్తారు' అన్నారు.

నాతోపాటు ప్రజలు కోపంగా ఉన్నారు..
తాను రాజకీయాలకు పనికిరానని కమల్హాసన్ స్పష్టం చేశారు. ‘నేను చాలా కోపిష్టిని. మీకు కోపం గల రాజకీయనాయకులు అవసరం లేదు. సమతుల్యంతో వ్యవహరించే రాజకీయ నాయకులంటే మీకు ఇష్టం. ప్రస్తుతం నేను కోపంగా ఉన్నాను. తమిళ ప్రజలు కూడా..' అని అన్నారు.

సిద్ధార్థ, అరవిందస్వామి ఆగ్రహం
విశ్వాస పరీక్షలో పళనిస్వామి గెలుపొందాక ‘తమిళనాడు సురక్షితం' అంటూ ఏఐఏడీఎంకే అధికారిక ట్విటర్లో ట్వీట్ పోస్ట్ చేయడంపై సినీనటులు సిద్ధార్థ, అరవింద్స్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న శశికళకు ఓ ల్యాప్టాప్ ఇస్తే తర్వాతి నాలుగేళ్లు చెన్నై నుంచి బెంగళూరు జైలుకి తిరిగేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామికి రవాణా ఖర్చులు మిగులుతాయని సిద్ధార్థ ట్వీట్ చేశారు. మనం తినే ఆహారంలో ఉప్పు మరికాస్త ఎక్కువ వేసుకోవాల్సిన సమయం వచ్చిందని వారన్నారు.

శశికళే మేలు.. సుబ్రణ్యస్వామి ధ్వజం
తమిళనాట అధికారంలో డీఎంకే వంటి దేశద్రోహుల కన్నా శశికళవంటి అవినీతిపరులు ఉండటమే ఎంతో మేలని భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. అంతకుముందు(అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలకముందు) కూడా మెజార్టీ ఉన్న శశికళను సీఎం చేయొచ్చు కదా అంటూ గవర్నర్కు సుబ్రమణ్యస్వామి సూచించారు.












Click it and Unblock the Notifications