దాసరి అలా చెప్పారా: భూమన ఆసక్తికర వ్యాఖ్యలు, అసలేమన్నారు..
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఆ సమయంలో కూడా కొందరు రాజకీయం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అమరావతి/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఆ సమయంలో కూడా కొందరు రాజకీయం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా వైసిపి భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది. దాసరి మృతి సమయంలోను ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదంటున్నారు. దాసరి తమ పార్టీకి మద్దతు పలికారని, జగన్ను సీఎం చేయాలనుకున్నారని భూమన అన్నట్లుగా వార్తలు వచ్చాయి.
దటీజ్ దాసరి: అందుకోసం చిరంజీవితోనూ కలిశారు!
వైయస్ జగన్కు భూమన కరుణాకర్ రెడ్డి సన్నిహితులు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యానించడం చర్చకు, విమర్శలకు దారి తీసింది. ఆ సమయంలో అలాంటి వ్యాఖ్యలు సరికాదని అంటున్నారు.
భూమన ఏమన్నారంటే..
జగన్ తనతో కలసి దాసరిని రెండుసార్లు కలిశారని, మనస్ఫూర్తిగా జగన్ను ఆశీర్వదిస్తూ.. నిన్ను సీఎంగా చూడాలని ఉందని దాసరి చెప్పారని వ్యాఖ్యానించారు. అంతేకాదు 2017 చివరి నాటికి వైసిపిలో బేషరతుగా చేరుతానని, 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా తిరిగి జగన్ గెలుపుకోసం ప్రచారం చేస్తానని దాసరి తమతో అన్నారని తెలిపారు.
జగన్కు ఫోన్ చేశారని..
ఈ నెల 4న దాసరి జన్మదినోత్సవం సందర్భంగా జగన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినపుడు కూడా ఆయన ఆత్మీయంగా మాట్లాడి ఆశీర్వదించారని భూమన తెలిపారు. ఇంతలోనే దాసరి మృత్యుఒడికి చేరుకోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఆయన మృతి తీరని లోటని భూమన పేర్కొన్నారు.
ఆయనే చెప్పాల్సింది.. దాసరి
దాసరి స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సమయంలో భూమన మాట్లాడిన మాటలు పలు సందేహాలను కలిగస్తున్నాయి. స్వయంగా దాసరి చెబితే తప్ప ఇప్పుడు నిర్ధారించుకోలేని విషయాన్ని భూమన చెప్పడం చర్చకు దారి తీసింది.
సాక్షితో దాసరి ఏమన్నారంటే..
దాసరి మొదటిసారిగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడానికి ముందు సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. జగన్ అద్భుతంగా పని చేస్తున్నారని, సమస్యల పట్ల ఎవరూ స్పందించనంత వేగంగా స్పందిస్తున్నారని దాసరి కితాబిచ్చారు.
కాపు అంశంపై..
మరోవైపు, కాపు రిజర్వేషన్ సమస్యపై దాసరి నారాయణ రావుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ అవగాహన ముందుకు వెళ్తుందనే వాదనలు వినిపించాయి. దాసరి.. జగన్కు దగ్గరవుతున్నట్లుగా కూడా పరిస్థితులు కనిపించాయి. కానీ మృతి సమయంలో భూమన మాట్లాడటం, దాసరి చెబితే తప్ప నిర్ధారించుకోలేని అంశాలను ఆయన చెప్పడం విమర్శలకు దారి తీసింది.
చంద్రబాబు వ్యాఖ్యలపై వ్యతిరేకులు ఇలా...
రాజకీయంగా చంద్రబాబుకు దాసరికి దూరం ఉందనే చెప్పవచ్చు. దాసరికి నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా ఆయన వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారంటున్నారు. దాసరి తనను ఫ్యామిలీ మెంబర్గా చూసేవాడని, తనను సొంతవాడిలా చూసుకున్నారని, నేను అంటే చాలా అభిమానం అని తెలిపారు.
వ్యక్తిగత పరిచయం కావొచ్చు
దాసరి - చంద్రబాబులకు తొలి నుంచి రాజకీయ విభేదాలు ఉండవచ్చు. అయితే వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండవచ్చు. కాబట్టి చంద్రబాబు అలా వ్యాఖ్యానించారు. కానీ, మొదటి నుంచి రాజకీయ విభేదాలు ఉండటం, తాజాగా కాపు ఉద్యమంలోను చంద్రబాబుకు వ్యతిరేకంగా దాసరి మాట్లాడటాన్ని చూపిస్తూ కౌంటర్ ఇస్తున్నారని అంటున్నారు.