జడ్జి లోయ మృతి అద్యంతం అనుమానాస్పదం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి బీహెచ్ లోయ అనుమానాస్పద మరణం కేసు విచారణపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయమే జడ్జీలు మీడియా ముందుకు రావడానికి తక్షణ కారణమని తెలుస్తోంది. సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ హత్యకేనును విచారిస్తూ జడ్జి బీహెచ్ లోయ 2014 డిసెంబర్ ఒకటో తేదీన అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన మరణించడానికి ముందు సోహ్రాబుద్దీన్ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అనుకూలంగా తీర్పు చెబితే రూ.100 కోట్ల ఆఫర్ ఉన్నదని సాక్షాత్ నాటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మొహిత్ షా చేశారని లోయ సోదరి బియానీ ఆరోపించారు.
గమ్మత్తేమిటంటే లోయ మరణం తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా నియమితులైన ఎంబీ గోసవి అనే న్యాయమూర్తి సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారించారు. 2015 డిసెంబరులో అమిత్ షా, ఇతర పోలీసు అధికారులపై కేసు కొట్టివేయడం గమనార్హం. 2014 డిసెంబర్ ఒకటో తేదీన నాగ్పూర్లో లోయ మరణం తర్వాత అకస్మాత్తుగా ఇద్దరు బాంబే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయి, జస్టిస్ షుక్రే రంగ ప్రవేశం చేసి.. అనుమానాలేమీ లేవని కొట్టి పారేయడం గమనార్హం.
జడ్జి లోయ మృతిపై విచారణకు మహారాష్ట్ర సర్కార్ నిరాకరణ
సొహ్రాబుద్దీన్ కేసులో విచారణ ఎదుర్కొన్న అమిత్షా ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు. మరోపక్క లోయ మృతి కేసుపై సమగ్ర విచారణ జరపాలని వచ్చిన పలు డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చుతూ వచ్చింది. బాంబే హైకోర్టు సైతం దీనికి అంగీకరించలేదు. కానీ- లోయ కుటుంబసభ్యుల అభిప్రాయాలతో కారవాన్ అనే పత్రిక - గతేడాది డిసెంబర్లో ప్రచురించిన ఓ కథనం ప్రకంపనలు రేపింది. దీనిపై విచారణ కోరుతూ బాంబే హైకోర్టులో మళ్లీ ఓ పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో- ఇటు సుప్రీంకోర్టులోనూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటేమో- బీఆర్ లోన్ అనే జర్నలిస్టు, మరొకటి తెహసీన్ పూనావాలా అనే కాంగ్రెస్ నేత దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇది చాలా సీరియస్ వ్యవహారమన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది దీన్ని వెంటనే విచారణకు టేకప్ చేయాలన్న అభ్యర్థనను మన్నించింది.
చీఫ్ జస్టిస్ ను చలమేశ్వర్ తదితరులు ప్రశ్నించారా
కానీ శుక్రవారం విచారణ లిస్టింగ్స్లో ఈ కేసును - జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఎం శంతనగౌడర్లతో కూడిన బెంచ్కు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా కేటాయించడం సీనియర్ జడ్జీలకు ఆగ్రహం కలిగించినట్లు సమాచారం.. రాజకీయంగా కీలకమైన కేసుల విచారణలో తమను ఎందుకు బైపాస్ చేస్తున్నారో చెప్పండని- జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ప్రభృతులు ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను ప్రశ్నించినట్లు సుప్రీంకోర్టు వర్గాల కథనం. రోస్టర్ అంతా ప్రధాన న్యాయమూర్తి చేతిలోనే ఉంటుంది కాబట్టి వీరి ప్రశ్నకు సమాధానం దొరకలేదని తెలుస్తోంది.
అమిత్ షాకు జడ్జి లోయ నోటీసులు జారీ
సొహ్రబుద్దీన్ షేక్ అనే వ్యక్తిని, ఆయన భార్య కౌసర్ బీని, వారి స్నేహితుడు తులసీదాస్ ప్రజాపతిని గుజరాత్ యాంటీ- టెర్రరిస్ట్ స్క్వాడ్ 2005 నవంబర్ 3న హైదరాబాద్ నుంచి సాంగ్లీ వస్తున్నపుడు బస్సులో నుంచి దించి- విడివిడిగా తీసికెళ్లి ఎన్కౌంటర్ చేసి చంపేసింది. ఈ కేసులో అప్పటి గుజరాత్ హోంమంత్రి, నేటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కీలక నిందితుడు. ఆ కేసు విచారణను గుజరాత్ నుంచి ముంబైకు మార్చారు. దానిని మొదట చేపట్టిన జడ్జిని ఆకస్మికంగా బదిలీ చేసేశారు. అతని స్థానంలో వచ్చిన రెండో జడ్జి బీహెచ్ లోయ. కేసును చాలా పకడ్బందీగా విచారణ చేపట్టిన లోయా- విచారణకు హాజరు కావాలని పలుసార్లు నోటీసులు జారీ చేసినా అమిత్ షా వాటిని ఎప్పడూ ఖాతరు చేయలేదు. ఏదో ఓ కారణంతో వాయిదా వేయిస్తూ వస్తున్నారు.
ఛాతీలో నొప్పితో నాగ్ పూర్ ఆసుపత్రిలో మృతి ఇలా
ఓ జడ్జి కూతురి పెళ్లికి హాజరయ్యేందుకు 2014 డిసెంబర్ ఒకటో తేదీన నాగ్పూర్ వెళ్లిన లోయ ఇక ప్రాణాలతో తిరిగి రాలేదు. నాగ్పూర్లోని రవి భవన్ అనే వీఐపీ గెస్ట్ హౌస్లో బసచేసిన లోయ కానీ తెల్లవారు ఝామున నాలుగు గంటలకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసికెళుతుండగా చనిపోయారని- వార్తా కథనాలు వచ్చాయి. ఆయన మరణం వెనుక మిస్టరీ ఉందని ఆ తరువాత లోయా సోదరి బియానీ, తండ్రి హరి కిషన్ ఆరోపించారు. దీనిపై పునర్విచారణ జరపాలని లోయా సోదరి, తండ్రి హరి కిషన్ మీడియాకు చెప్పినా లోయ కుమారుడు అనూజ్ మాత్రం తన తండ్రి మరణంలో తమకెలాంటి సందేహాలు లేవని బాంబే హైకోర్టు ఛీఫ్ జస్టిస్ మంజులా చెల్లూర్ను వ్యక్తిగతంగా కలిసి చెప్పాడం విశేషం. అయితే ఆయన- బయటి ఒత్తిళ్ళ వల్లే అలా చెప్పి ఉంటారని కథనాలొచ్చాయి. కానీ అనూజ్ గానీ, ఆయన తల్లి (లోయ భార్య) గానీ బహిరంగంగా లోయ మరణంపై స్పందించేందుకు వెనుకాడుతున్న పరిస్థితి వారిని కలువడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు గమనించారు.
ఆటో రిక్షాలో దవాఖానకు లోయ తరలింపు
లోయ మరణానికి వారం ముందు ఆయనకు ఓ ఆఫర్ వచ్చింది. కేసులో అమిత్షాను నిర్దోషిగా ప్రకటించి- క్లీన్చిట్ ఇస్తే వంద కోట్ల రూపాయలిస్తామన్నది ఆ ఆఫర్. ఈ ఆఫర్ సాక్షాత్తూ అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మొహిత్ షా చేశారని లోయ సొదరి బియానీ ఆరోపించారు. లోయకు గుండెల్లో నొప్పి వచ్చినపుడు తామే కార్లో ఆయనను దగ్గర్లోని దండే ఆసుపత్రికి తీసికెళ్ళామని ఇద్దరు జడ్జీలు జస్టిస్ శ్రీధర్ కులకర్ణి, జస్టిస్ శ్రీరామ్ మోదక్ చెప్పారు. స్థానిక జడ్జి విజయ్కుమార్ బోర్డే కారును డ్రైవ్ చేశారని వెల్లడించారు. ఇది నిజం కాదు. దండే ఆసుపత్రిలో అసలు ఈసీజీ మిషను పనిచేయలేదని, అందుకని కొంత దూరంలోని కార్పొరేట్ ఆసుపత్రి- మెడిట్రినాకు తీసికెళ్లే సరికి ఆయన మార్గమధ్యంలో చనిపోయారని చెబుతున్నారు. కానీ ఆటో రిక్షాలో జడ్జి లోయను దవాఖానకు తరలించారని ప్రత్యక్ష సాక్షుల కథనం.
ఆరు నిమిషాల్లో వెళ్లాల్సిన దూరం 45 నిమిషాలు ఎందుకు?
లోయ చనిపోయినప్పుడు తాము ఆసుపత్రిలోనే ఉన్నామని, ఇందులో మిస్టరీ ఏమీ లేదని, ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని మరో ఇద్దరు జడ్జీలు జస్టిస్ భూషణ్ గవాయ్, జస్టిస్ సునీల్ షుక్రే మీడియాకు చెప్పారు. కానీ వారు అక్కడ లేరని వేరే దర్యాప్తులో వెల్లడైంది. లోయాను ఆటోలో ఆసుపత్రికి తీసికెళ్లారు. ధండే ఆసుపత్రిలో ఈసీజీ చేశారు. దాని మీద ఉన్న తేదీ నవంబర్ 30 అని ఉన్నది. అప్పటికి లోయా అసలు నాగ్పూరే రాలేదు. ప్రారంభం నుంచి బాంబే హైకోర్టు జడ్జీలు అసలు సీన్లోనే లేరు.. సడెన్గా వారు ఎందుకు ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చారో తెలీదు. ‘ఆయన చనిపోయారని మాకు 5 గంటలప్పుడు చెప్పారు. కానీ రిపోర్టులో 6:15కి చనిపోయినట్లు రాశారు' అని లోయ కుటుంబ సభ్యులు చెప్పారు. గూగుల్ మ్యాప్ సూచికల ప్రకారం ఆరు నిమిషాల్లో దండే ఆసుప్రతికి వెళ్లొచ్చు. కానీ ఉదయం నాలుగు గంటలకు చాతీలో నొప్పి వస్తే లోయను దవాఖానకు తీసుకొచ్చే సరికి 4.45 నుంచి ఐదు గంటలైందని తెలుస్తున్నది.
రక్తంతో చొక్కా తడిచిపోవడమేమిటన్న ప్రశ్నలకు సమాధానం కరువు
ఛాతీలో నొప్పి వచ్చిన మాటే నిజమైతే లోయ శరీరంపైన గాయాలు, దుస్తులు రక్తంతో ఎందుకు తడిసాయని ఆయన కుటుంబ సభ్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లోయ సోదరి బియానీ స్పందిస్తూ ‘ఆయన చొక్కా కాలర్ పైనా రక్తం ఉంది. ప్యాంట్ బెల్ట్ వ్యతిరేక దిశలో ఉంది. ప్యాంట్ క్లిప్ విరిగిపోయి ఉంది. మా మామ కూడా ఇది సందేహస్పదం అని అనుమానిస్తున్నారు' అని చెప్పారు. లోయ తండ్రి హరికిషన్ మాట్లాడుతూ బట్టలన్నీ రక్తంతో తడిచిపోయాయన్నారు. భుజం పై నుంచి నడుము వరకు చొక్కా రక్తంతో తడిసిపోయిందని చెప్పారు. మరో సోదరి మంధానే మాట్లాడుతూ మెడపై రక్తపు చారికలు ఉన్నాయని, తలపై గాయమైందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానాలే రాకపోవడం గమనార్హం.