బీజేపీకి షాక్: ఢిల్లీలో తెలుగోళ్లు ఎవరివైపు, ఎందుకు?
న్యూఢిల్లీ: మినీ భారత్ అయిన ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన దేశం యావత్తు ఆసక్తికరంగా చూసింది. సార్వత్రిక ఎన్నికల నుండి బీజేపీ హవా కొనసాగడం, ఢిల్లీలో కమలం పార్టీకి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చెక్ చెబుతుందని ఎగ్జిట్, ప్రీపోల్ సర్వేలు చెప్పిన నేపథ్యంలో మరింత ఉత్కంఠగా మారాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినట్లే.. ఢిల్లీ పీఠం పైన ఏఏపీ కూర్చోబోతోంది.
అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు రెండు లక్షలకు పైగా ఉన్నారు. వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు కమలం పార్టీ సినీ నటుడు కృష్ణం రాజు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తెలుగు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది.
ఢిల్లీలోని తెలుగు ఓటర్లు ఎక్కువ మంది కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. బీజేపీ వైపు తక్కువ మంది మొగ్గు చూపారని సమాచారం. అందుకు పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఇరు రాష్ట్రాలకు న్యాయం చేస్తామని చెప్పింది. రాజ్యసభలో వెంకయ్య నాయుడు విభజన కోసం గట్టిగా మాట్లాడుతూనే, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్ చేశారు. ఇది అప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయింది.
అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందనే అభిప్రాయంతోనే ఢిల్లీలోని తెలుగు ఓటర్లు ఎక్కువ మంది ఏఏపీ వైపు వెళ్లారంటున్నారు.
తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలం కావడమే కాకుండా, ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే దిశలో లేకపోవడమే అందుకు కారణమంటున్నారు. ఏపీకీ ప్రత్యేక హోదాపై మెలికలను నిదర్శనంగా విశ్లేషకులు చూపిస్తున్నారు. ఇటీవల ఏపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఢిల్లీలోని తెలుగు ఓటర్ల కోసమే బీజేపీ ప్యాకేజీ అంటూ ఎన్నికలకు ముందు ప్రకటించిందని ఆరోపించారు.