ధోనీ: కెప్టెన్ కూల్ ఉద్వేగానికి గురైన వేళ
మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టును విజయాల బాటన నడిపించిన మహేంద్ర సింగ్ ధోనీ కూల్ కెప్టెన్గా పేరు పొందాడు. అత్యంత క్లిష్టమైన స్థితిలో కూడా అతను కూల్గా కనిపించేవాడు. ఏ మాత్రం ఉద్వేగానికి గురయ్యేవాడు కాడు. అటువంటి ధోనీ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. తాను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మరుక్షణం భారత జట్టు డ్రెసింగ్ రూంలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు.
ఆ ప్రకటన చేసిన తర్వాత జట్టు సహచరులు అతన్ని ఆలింగనాలతో హత్తుకున్నారు. అతనితో కలిసి ఫొటోలు తీయించుకున్నారు. తన నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో ధోనీ కాస్తా ఉద్వేగానికి లోనైనట్లు తనకు ఎవరో చెప్పారని బిసిసిఐ కార్యదర్సి సంజయ్ పటేల్ అన్నారు.
జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి దోనీ రిటైర్మెంట్ ప్రకటన గురించి వైబ్సైట్లో రాశాడు. అతను డ్రెసింగ్ రూంకు వెళ్లేప్పుడు జట్టు సభ్యులందరినీ వెంట తీసుకుని వెళ్లాడు. ఏ విధమైన స్వప్నాలూ లేవని నిర్మొహమాటంగా చెప్పేశాడు. అన్ని ఫార్మాట్లలో తాను ఆడలేనని, టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని ధోనీ చెప్పాడు. చివరి వరకు ధోనీ నిజాయితీగా ఉన్నాడని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.
అన్ని ఫార్మాట్లూ ఆడలేనని తన జట్టుతో చెప్పే తెగువ ధోనీకి మాత్రమే ఉందని, తన పట్ల తన జట్టు సభ్యుల పట్ల అతను ఎంత నిజాయితీగా ఉన్నాడో ఈ సంఘటన తెలియజేస్తుందని అన్నారు. ధోనీ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాటో కోహ్లీకి మార్గం సుగమం చేస్తూ అతను ఆ ప్రకటన చేశాడు.
భారత టెస్టు క్రికెట్ గొప్ప కెప్టెన్లలో ధోనీ ఒకడని, అతని నాయకత్వంలోనే ఇండియా నెంబర్ వన్ స్థానాన్ని పొందిందని, అన్ని ఫార్మాట్లలో ఆడుతుండడం ఒత్తిడికి గురవుతున్నట్లు భావించి ధోనీ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడని బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది.