అలాంటి నిర్ణయాలు వద్దు: బాబుకు అమిత్ షా-రాజ్నాథ్ ఫోన్, టీడీపీ వెనుకడుగు?
అమరావతి: బడ్జెట్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఎంపీలతో భేటీ అనంతరం ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటారని వార్తలు జోరుగా వచ్చాయి. అవసరమైతే బీజేపీతో తెగదెంపులు చేసుకుంటారని, కనీసంగా టీడీపీ కేంద్రమంత్రులతో రాజీనామా చేయిస్తారనే అభిప్రాయం వ్యక్తమయింది.
అయితే, రేపటి నుంచి ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని, దీనిపై తగ్గవద్దని, సస్పెండ్ అయినా వెనక్కి తగ్గవద్దని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ఎంపీల మాట తీరులో కూడా మార్పు వచ్చిందని అంటున్నారు. ఓ విధంగా బడ్జెట్ విషయంలో వారు చూపిన ఆగ్రహానికి, చంద్రబాబు ఎంపీలకు ఇచ్చిన ఆగ్రహానికి పొంతన లేదని అంటున్నారు.
జగన్ దెబ్బ, బాబు డైలమా.. బడ్జెట్పై ఇదీ వ్యూహం! అశోక్-సుజనల రాజీనామా, ట్విస్ట్
చంద్రబాబు అడుగు వెనక్కి వేశారా?
బడ్జెట్ ఏమాత్రం బాగాలేదని, ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తే, ఇక తెగతెంపులేనని ఎంపీలు వ్యాఖ్యానించారు. కానీ తీరా చూస్తే కేంద్రంతో ఇప్పుడు గొడవ సరికాదని భావిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. అందుకే చంద్రబాబు ఓ అడుగు వెనక్కి వేశారని చెప్పవచ్చునని అంటున్నారు. తాడోపేడో తేల్చుకుంటారని భావిస్తే పార్లమెంటులో పోరాటం చేయాలని, ఇది మొదటి అడుగు అని చెప్పారు.
అనూహ్య నిర్ణయం తీసుకోకుంటే
దీనిని బట్టి చూస్తే పార్లమెంటు సమావేశాలు ముగిసేసరికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దలేకుంటే టీడీపీ ఎంపీలు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. సమావేశాలు ముగిసేవరకు కూడా ఎలాంటి అనూహ్య నిర్ణయం తీసుకోకుంటే చంద్రబాబు ఓ అడుగు వెనక్కి వేసినట్లుగానే భావించవచ్చునని, లేదా అనూహ్య నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రధాని మోడీకి, బాబుకు పెద్ద షాకిచ్చినట్లే భావించవచ్చునని అంటున్నారు.
చంద్రబాబు తగ్గారా, ఎందుకు
చంద్రబాబు ఒక అడుగు వెనక్కి వేశారా, తగ్గితే ఎందుకు తగ్గారనే చర్చ సాగుతోంది. ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు ఫోన్ చేశారు. వారి నుంచి హామీ వచ్చిందా లేక హామీతో పాటు తాము బయటకు వెళ్తే వైసీపీ ఎన్డీయేలో కలుస్తుందని భావిస్తున్నారా, ఈ పరిణామాల నేపథ్యంలో తగ్గారా అనే చర్చ సాగుతోంది.
చంద్రబాబుకు అమిత్ షా ఫోన్
టీడీపీ ఎంపీలతో భేటీ సందర్భంగా చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారని తెలుస్తోంది. ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారని సమాచారం. శనివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ.. బీజేపీకి టీడీపీ పాత మిత్రులని, ఏపీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు.
చంద్రబాబుకు రాజ్నాథ్ సింగ్ ఫోన్
చంద్రబాబుకు రాజ్నాథ్ సింగ్ కూడా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆదివారం ఉదయం నుంచి మూడుసార్లు ఫోన్ చేశారని సమాచారం. తొలుత పార్టీ పార్లమెంటరీ భేటీలో ఉండటంతో మాట్లాడలేకపోయారు. భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు ఆయనతో మాట్లాడారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రబాబుకు ఆయన కూడా సూచించారు. మరికొన్ని రోజులు వేచి చూడాలని, తాము అన్ని విషయాలు మాట్లాడుతామన్నారు.