ట్విస్ట్: పోలవరంపై కమిటీ, అక్టోబర్ 25న, గడ్కరీ కీలక సమావేశం, ఏమౌతోంది?
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించింది. 2019 ఎన్నికల నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలంటే ప్రస్తుతమున్న ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించింది. 2019 ఎన్నికల నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలంటే ప్రస్తుతమున్న ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మరో వైపు కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయంతో ఉంది. ఈ విషయమై కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ తరుణంలోనే కేంద్ర జలవనరుల శాఖ ఓ కమిటీనీ ఏర్పాటు చేసింది.
Recommended Video

2019 ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలను చేస్తోంది. అంతేకాదు ప్రస్తుతం నడుస్తున్న పనులతో 2019 ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కొత్త కాంట్రాక్టర్లకు పనులను అప్పగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తైతే 2019 ఎన్నికల్లో ఈ ప్రభావం రాజకీయంగా తమకు కలిసివస్తోందని టిడిపి భావిస్తోంది. ఈ తరుణంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకుగాను గాను ప్రతి సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. అంతేకాదు వీలైనన్నీ ఎక్కువసార్లు పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబునాయుడు తనిఖీ చేస్తున్నారు.
విదేశీ పర్యటనకు వెళ్ళే ముందు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పోలవరం ప్రాజెక్టు పనుల విషయమై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.

పోలవరంపై కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం
పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి కావాలంటే కొత్తగా కాంట్రాక్టర్లను నియమించడంతో పాటు ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.ఈ తరుణంలో కేంద్ర జలవనరులశాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. నర్మద కంట్రోల్ అథారిటీ కార్యనిర్వాహక సభ్యుడు సిన్హా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఈయనతో పాటు వ్యాప్కోస్కు చెందిన ఎ.ఎన్.ఎన్.ప్రసాద్, జాతీయ హైడల్ విద్యుత్తు కంపెనీ పాత డైరక్టర్ డి.పి.భార్గవ, వ్యాప్కోస్ నుంచి ఎస్.సి.గుప్తా, ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, కేంద్ర జలసంఘంలో ప్రాజెక్టుల విభాగంలో డైరక్టర్గా ఉన్న గోవర్ధన్ ప్రసాద్లను కమిటీ సభ్యులుగా నియమించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిని ఈ కమిటీకి సమన్వయకర్తగా ఏర్పాటు చేశారు.

కాంట్రాక్టర్ మార్పుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి అవసరం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం పెంచాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మార్పులను రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే ఆర్థిక సహాయం చేస్తున్నందున గుత్తేదారుడిని మార్చాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి అవసరం. ఈ నేపథ్యంలో బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లింది. గత వారమే జలవనరులశాఖ కార్యదర్శి, ఇంజినీర్ ఇన్ చీఫ్లు కేంద్ర అధికారులతో జరిపిన చర్చల మేరకు ఈ కమిటీ ఏర్పాటు చేశారు.

గడ్కరీ నేతృత్వంలో పోలవరంపై సమావేశం
అక్టోబర్ 25న కేంద్ర జలవనరులశాఖ మంత్రి గడ్కరీ డిల్లీలో పోలవరంపై ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పోలవరం గుత్తేదారులు, ఉపగుత్తేదారులతో సహా కేంద్ర, రాష్ట్ర జలవనరుల అధికారులు పాల్గొంటారు. ఆ రోజు ఈ నూతన కమిటీ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం లేకపోలేదు. ఈ వ్యవహారంలో మిళితమై ఉన్న అన్ని అంశాలపైనా చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించి ఒక నివేదిక పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమర్పిస్తుంది. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

కొత్త కమిటీ ఏం చేయనుంది
కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ వీలైనంత తొందరగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది.. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలించాలి.. అన్ని అంశాలపై అధ్యయనం చేసి 15 రోజుల్లోగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తన నివేదికను సమర్పించాలి.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిని అన్ని కోణాల్లో పరిశీలించి ఎలా ఉందో విశదీకరించాలి. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థికపరమైన, సాంకేతికపరమైన, గుత్తేదారులకు సంబంధించిన విషయాల్లో అన్ని అంశాలను పరిశీలించాలి. నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే ఏం చేయాలో తగిన సలహాలు ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications