ఇంతలోనే కేసీఆర్ చక్రం: 'పవర్' గేమ్లో పరిణామాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి రెండేళ్లు పుర్తి చేసుకుంది. విభజన బిల్లు అంతకుముందే పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ అపాయింటెడ్ డే మాత్రం జూన్ 2. అధికారికంగా మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లుగా విడిపోయింది 2014 జూన్ 2వ తేదీన.
నాడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, కేసీఆర్లు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఫలితాలు వెల్లడైన పదిహేను, ఇరవై రోజులకు వీరు సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. విభజన జరిగిన రోజు అయిన జూన్ 2న కేసీఆర్, ఆ తర్వాత జూన్ 8న చంద్రబాబు ప్రమాణం చేశారు.
తెలంగాణ ఏర్పాటుతో పాటు కేసీఆర్ పాలనకు కూడా సరిగా రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారంలోకి వస్తుందా లేదా అన్ని ఊగిసలాట నుంచి ఇప్పుడు ఏకంగా ప్రతిపక్షాలను తెరాస తుడిచి పెట్టేసింది.
ఆపరేషన్ ఆకర్ష్
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా విపక్షాలకు చుక్కలు చూపించారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, ముగ్గురే మిగిలారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది గెలిస్తే పదమూడు మంది మిగిలారు. ఇంకా, ఎవరు ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. వైసిపి పూర్తిగా ఖాళీ అయింది.
చంద్రబాబు - కేసీఆర్
రాజకీయంగా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. పక్క రాష్ట్రమైన ఏపీతో విభజన తగాదాలు కొనసాగుతున్నాయి. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహారాష్ట్రతో ప్రాజెక్టుల విషయమై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. కిందిస్థాయి నేతలు, నాయకులు, కార్యకర్తలు అయితే రోజుకు ఎంతోమంది చొప్పున తెరాసలో చేరుతున్నారు.
నాన్నకు ప్రేమతో
తెలంగాణ వచ్చే నాటికి తెరాసకు నాలుగు జిల్లాల్లోనే బాగా బలం ఉండేది. కరీంనగర్, వరంగల్, మెదక్ తదితర జిల్లాల్లో బలం ఉంది. ఖమ్మం, హైదరాబాదులో తెరాస ఉనికి లేదు. కానీ రెండేళ్లు తిరిగేసరికి పది జిల్లాలు తెరాస చేతిలోకి వచ్చాయి. అంతేకాదు, నారాయణఖేడ్, పాలేరు, వరంగల్... ఇలా అన్ని ఉప ఎన్నికల్లో గెలిచారు. హైదరాబాదులో ఏమీ లేని నుంచి ఏకంగా 99 కార్పోరేటర్లు ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుచుకున్నారు.
బోటాబోటీ నుంచి శాసించే స్థాయికి
2014 ఎన్నికల సమయంలో తెరాస 63 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అది బొటాబోటీ మెజార్టీ. రెండేళ్లు తిరిగేసరిసి 88 మంది ఎమ్మెల్యేలు తెరాసలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆరుగురు,టిడిపి నుంచి పన్నెండు మంది, వైసిపి నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు తెరాసలో చేరారు. విపక్షాల బలం పూర్తిగా తగ్గిపోయింది. తెరాస రోజురోజుకు బలం పెంచుకుంటోంది.
తెలంగాణ సెంటిమెంట్
తెలంగాణ సెంటిమెంట్, కేసిఆర్ పలుకుబడి ఇంకా తెరాసకు పనికి వస్తుందనే వాదనలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ పాలన సరిగా లేకున్నప్పటికీ ప్రజలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. తెలంగాణ సాధించిన కెసిఆర్ అనే భావన ప్రజల్లో ఉందని, అందుకే ఆయనకు మరింత సమయం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. మరో ఇరవై ఏళ్లు కేసీఆరే పాలిస్తారని తెరాస చెబుతోంది. అయితే, కెసిఆర్ పాలన బాగాలేదని ప్రజలు మరో ఒకటి రెండేళ్లలో గుర్తిస్తారని, 2019లో ఓడిపోవడం ఖాయమని విపక్షాలు అంటున్నాయి.
సెంటిమెంట్ బలపడకుండా..
నీళ్లు, నిధులు, నియామకాల గురించే తెలంగాణ ఉద్యమం జరిగిందని, ఆ దిశలో పయనిస్తున్నామని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. నియామకాలు క్రమంగా జరుపుతామని, విభజన నేపథ్యంలో మన నిధులు మనకే ఉన్నాయని చెప్పారు. ఇక నీళ్ల విషయంలో పక్క రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కృష్ణా, గోదవరి నీటిపై ఏపీతో రగడ సాగుతోంది. విపక్షాలు.. ముఖ్యంగా టీడీపీపై ఈ ఆయుధాన్నే కేసీఆర్ ఉపయోగిస్తున్నారు. తద్వారా సెంటిమెంటు బలహీనపడకుండా చేస్తున్నారని చెబుతున్నారు.
పదేపదే కిరణ్ కుమార్ పేరు
విభజన జరిగితే తెలంగాణ చీకట్లో మగ్గిపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు తాము ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇస్తున్నామని తెరాస చెబుతోంది. ఇలాంటి కారణాలతో తెలంగాణ సెంటిమెంటు బలహీనం కాకుండా చూసుకుంటోందనే వాదనలు ఉన్నాయి. అలాగే, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల రీడిజైనింగ్, సంక్షేమ పథకాలు ప్రజల కోసమేనని చెబుతున్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పైన అసెంబ్లీలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సాగర్ శుభ్రతకు, హైదరాబాద్ను వరల్డ్ క్లాస్ సిటీగా చేసే అంశాలపై దృష్టి సారించారు. ఇతర నగరాల పైన కూడా దృష్టి సారించారు.
తీవ్ర విమర్శలు
ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దోచుకునేందుకే రీడిజైనింగ్ అంటున్నారని ఆరోపిస్తున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. వెయ్యి మంది తెలంగాణ కోసం చనిపోయారని చెప్పి, ఇప్పటి వరకు సగం మందిని కూడా గుర్తించలేదని మండిపడుతున్నారు.
తీవ్ర విమర్శలు
తెలంగాణ ఉద్యమకారుల పైన ప్రేమ ఉంటే శ్రీకాంత చారి తల్లికి ఎమ్మెల్సీ సీటు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చారని, విపక్షాలు, ఇతరులు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. సచివాలయం తరలింపు, ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి, ఎన్టీఆర్ ఘాట్ తదితర అంశాలు వివాదానికి దారి తీశాయి. ఉద్యోగార్థులు కూడా ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు.
తీవ్ర విమర్శలు
తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, కెసిఆర్ తన కుటుంబానికి బాగా డబ్బులు వచ్చే, ప్రాధాన్యం గల శాఖలను ఇస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే, తనయుడు కేటీఆర్ను వారసుడిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శిస్తున్నారు. మంత్రి హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గుతుందనే వాదనలు కూడా ఉన్నాయి.
చిరంజీవి
ఇదిలా ఉండగా కెసిఆర్ పాలన పైన ఏపీ నేతలు ప్రశంసలు కురిపించడం గమనార్హం. సెక్షన్ 8 విషయంలో తెలంగాణ వాదనను పవన్ కళ్యాణ్ సమర్థించారు. సినిమా పరిశ్రమకు కెసిఆర్ బాగా పని చేస్తున్నారని చిరంజీవి కితాబిచ్చారు. సినీ పరిశ్రమ మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని పొగుడుతోంది.