ఐటి రాజధాని నుంచి ఐటి హబ్: ఎందుకు?
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ఐటి సోదాల్లో ఎక్కువ సొమ్ము దొరికింది కర్ణాటకలోనే.. బెంగళూరు ఐటి రాజధాని నుంచి ఐటి హబ్గా మారిన వైనం...
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ఐటి సోదాల్లో ఎక్కువ సొమ్ము దొరికింది కర్ణాటకలోనే.. బెంగళూరు ఐటి రాజధాని నుంచి ఐటి హబ్గా మారిన వైనం...
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా ఐటి దాడులు జరిగి, ఎక్కువ నగదు పట్టుబడింది కర్ణాటకలోనే. ఐటి రాజధాని బెంగళూరుకు పేరెన్నిక గన్న కర్ణాటక ఇప్పుడు ఐటి హబ్గా మారింది. అంటే ఇన్ఫర్మే,న్ టెక్నాలజీ రాజధానిని కలిగి ఉన్న కర్ణాటక ఆదాయం పన్ను (ఐటి) హబ్గా మారింది.
లెక్క చెప్పని నగదు, అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ము విషయంలో దేశంలో కర్ణాటక అగ్రస్థానంలో నిలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కన్నా కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఐటి ఆధికారులు పెద్ద నోట్లను రద్దు చేసిన ర్వాత రూ.3 వేల కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 20 శాతం కర్ణాటకలోనే స్వాధీనం చేసుకోవడం విశేషం.
జాతీయ మీడియాలో వచ్చిన వార్తాకథనాలు కర్ణాటక స్థాయిని తెలియజేస్తున్నాయి.దేశవ్యాప్తంగా 48 కేసులను ఐటి శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి సిఫార్సు చేసింది. దర్యాప్తు నిమిత్తం ఈడికి సిఫార్సు చేసిన ఈ కేసుల్లో 23 కర్ణాటకలోనే నమోదయ్యాయి.
ఆ సొమ్ము గురించి ముందే చెప్పారు...
కేంద్ర ప్రభుత్వం ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం (ఐడిఎస్)పై ప్రకటన చేయకముందే ఐటి శాఖ అధికారులు లెక్క చెప్పని ఆదాయం కలిగి ఉన్న వ్యక్తుల జాబితాను తయారు చేసినట్లు ఆదాయం పన్ను శాఖ సీనియర్ అధికారులు చెప్పారంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
సోదాల్లో జాప్యం చేశారు...
తమ వద్ద జాబితా ఉన్నప్పటికీ ఆదాయం పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడంలో జాప్యం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వెంటనే ఐటి అధికారులు రంగంలోకి దిగారు. అప్పటికే వారి వద్ద జాబితా ఉండడంతో దాడులు చేసి సొమ్మును స్వాధీనం చేసుకోవడం సులభమైందని అంటున్నారు.
కర్ణాటకలో ఎస్ఓపి సిద్ధం చేశారు...
పెద్ద యెత్తున లావాదేవీలు జరుగుతున్న సహకార సంఘాలతో పాటు భారీ లావాదేవీలపై పన్ను కోత పెట్టని సంస్థల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ (ఎస్ఓపి)లను కర్ణాటక డైరెక్టరేట్ ప్రోయాక్టివ్ ఇన్వెస్టిగేటింగ్ వింగ్ సిద్ధం చేసింది. గత కొన్ని నెలలుగా పన్ను డిడక్ట్ చేయని ఈ జాబితాను రూపొందించింది. ఈ ఎస్ఓపి ఇతర డైరెక్టరేట్లకు ఆదర్శంగా నిలిచింది. అనుమానాస్పద లావాదేవీలపై కన్ను వేయడానికి వీలైంది.
అదే మార్గం చూపింది...
కర్ణాటక, గోవా ప్రాంత శాఖ దేశవ్యాప్త విశ్లేషణ చేసింది. ఐటి రాజధానిగా పేరు మోసిన బెంగళూరులో అనుమానాస్పద లావాదేవీలు పెద్ద యెత్తున జరిగినట్లు, దేశంలో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్లు తేలింది. 2010 - 16 మధ్య కాలంలో బెంగళూరులో అనుమానాస్పద లావాదేవీలు రూ.2,47,002 కోట్లు జరిగినట్లు తేలిందని, ఈ లావాదేవీల్లో పాన్ నెంబర్లు చూపలేదని తేలిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
అధికారులను ముందే హెచ్చరించారు...
టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాకథనం ప్రకారం - పేరు మోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కయి పాన్ నెంబర్లు చెప్పకుండా లావాదేవీలు జరుపుతున్నారనే విషయంపై ఐటి శాఖ అధికారులు సబ్ రిజిస్ట్రార్లను, స్థానిక రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ రంగంలోనే నల్లధనం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
దాని వల్లనే ఇలా...
ముందస్తుగా తీసుకున్న చర్యల కారణంగా కర్ణాటకలో డైరెక్టరేట్ రూ.29.86 కోట్లను స్వాధీనం చేసుకోగలిగింది. ఇందులో రూ.20.22 కోట్లు రూ.2 వేల నోట్లు కాగా, 41.6 కిలోల బులియన్, 14 కిలోల ఆభరణాలు ఉన్నాయి. నవంబర్ 9వ తేదీ నుంచి జరిగిన జరిగిన దాడుల్లో ఈ మొత్తం పట్టుబడింది.