కొర్రీలు: కార్పోరేషన్లు, బాండ్ల తనఖా యోచనలో ఏపీ
హైదరాబాద్: రైతుల రుణమాఫీ, రీషెడ్యూల్ పైన ఆర్బీఐ తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో... రైతులను కష్టాల నుండి గట్టెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఆలోచనలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకుల కొర్రీలు, రీషెడ్యూల్పై ఆర్బీఐ షరతులు విధించింది.
ఈ నేపథ్యంలో రైతు రుణాల మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తమార్గాలు అన్వేషిస్తోంది. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్పొరేషన్ల ఆదాయాన్ని తనఖా (గ్యారెంటీగా) పెట్టాలని భావిస్తోంది. అందులోనూ బాగా ఆదాయాన్ని ఇచ్చే ఏపీ బ్రేవరేజెస్ వంటి సంస్థలపై దృష్టి పెట్టింది.
అలాగే, ప్రభుత్వ బాండ్లు జారీ చేసి వాటిని బ్యాంకులకు తనఖా పెట్టడంపైనా చర్చిస్తోంది. ఈ అంశాలపై తాము కసరత్తు చేస్తున్నామని, చంద్రబాబు, సీఎస్ కృష్ణారావు, కోటయ్య కమిటీ ప్రతినిధులతో భేటీ అయిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు శనివారం సచివాలయంలో విలేకరులకు తెలిపారు.
ఆర్బీఐకి తాము గతంలో రాసిన లేఖకు జవాబు వచ్చిందని, నిరుడు ఖరీఫ్ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాత్రమే రీషెడ్యూల్ అర్హత లభిస్తుందని ఆర్బీఐ పేర్కొందని తెలిపారు. బంగారంపై రైతులు తీసుకున్న రుణాల రీషెడ్యూలు గురించి ఆర్బీఐ ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే రుణమాఫీ అమలుకు కార్పొరేషన్ల ఆదాయాన్ని తనఖా పెట్టడం, బాండ్లు జారీ చేయడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ కలిపితే రూ.లక్ష కోట్లపై చిలుకు ఉంటాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్బీఐకి ప్రభుత్వం మరో లేఖ రాస్తుందని మంత్రి చెప్పారు. మరోవైపు, పంట రుణమాఫీ అమలు, రీషెడ్యూలు కోసం సంబంధిత ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.