బాబుకు నిరాశ: కేసు పర్యవేక్షణ చేయనన్న గవర్నర్
హైదరాబాద్: అటార్నీ జనరల్ చేసిన సూచన మేరకు నోటుకు ఓటు కేసు పర్యవేక్షణ గవర్నర్ నరసింహన్ చేతులోకి వెళ్తుందని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రులకు, టిడిపి నేతలకు నిరాశే ఎదురైంది. అటార్నీ జనరల్ సూచన మేరకు నోటుకు ఓటు కేసును తాను పర్యవేక్షించడం సాధ్యం కాదని గవర్నర్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతోనూ, తెలంగాణ ఉన్నతాధికారులతోనూ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని శాంతిభద్రతలను గవర్నర్ పర్యవేక్షించవచ్చునని, ఓటుకు నోటు కేసును ఉభయ రాష్ట్రాల డిజిపిలను పిలిచి పర్యవేక్షించవచ్చునని భారత అటార్నీ జనరల్ సూచించారు. అయితే, అటార్నీ జనరల్ సూచనను పాటించాల్సిన అవసరం లేదని గవర్నర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ నుంచి గానీ కేంద్ర మత్రివర్గం నుంచి గానీ ఆదేశాలు వస్తేనే తాము పర్యవేక్షించడానికి వీలవుతుందని గవర్నర్ చెప్పినట్లు సమాచారం.

కాగా, నోటుకు ఓటు కేసును పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నర్కు ఏ విధమైన ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. ఈ కేసు విషయంలో సాధ్యమైనంత మేరకు జోక్యం చేసుకోకూడదనే కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసును పర్యవేక్షించాలని కేంద్రం ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కూడా చెప్పారు.
అటార్నీ జనరల్ సూచనపై తెలంగాణ ఉన్నతాధికారులకు సోమవారంనాడే గవర్నర్ స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నారు. భారత అటార్నీ జనరల్ సలహా ఇచ్చారనే విషయాన్ని నిర్ధారిస్తూ దాన్ని తాను పక్కన పెట్టేశానని గవర్నర్ నరసింహన్ చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారం ఉదయం గంట సేపు గవర్నర్తో సమావేశమయ్యారు. కెసిఆర్తోనూ గవర్నర్ అదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసును గవర్నర్ పర్యవేక్షించాలంటే కేంద్ర హోంశాఖ తొలుత కేంద్ర మంత్రివర్గానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, దాని ఆధారంగా కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని, అలా జరిగితే తప్ప ఓటుకు నోటును తాను పర్యవేక్షించడం సాధ్యం కాదని గవర్నర్ చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications