విమానం వెంట ఉత్తరకొరియా మిస్సైల్, వణికిన జపాన్, నిశ్శబ్దంగా అమెరికా యుద్ధ సన్నాహాలు!
వాషింగ్టన్: ఉత్తరకొరియా దూకుడుకు అగ్రరాజ్యం అమెరికా సైతం అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఎడాపెడా మిస్సైళ్లు, అణ్వాయుధ ప్రయోగాలతో ఆ దేశం ప్రపంచానికి ఝలక్ ఇస్తూనే ఉంది. ఉత్తరకొరియాకు సంబంధించిన ఓ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
అదేమిటంటే.. గత ఏడాది నవంబర్ 28న ఉత్తరకొరియా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి ఒకటి ఆ సమయంలో ఆకాశంలో ప్రయాణిస్తున్న హాంకాంగ్ విమానంలోని ప్రయాణికుల కళ్లబడిందట. మిస్సైల్ను చూడగానే అందరూ భయకంపితులయ్యారట.
..అయినా లొంగని ఉత్తరకొరియా!
ఐక్యరాజ్య సమితి విధిస్తున్న ఆంక్షలకుగాని, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూంకరింపులకుగాని.. మిత్రదేశాలైన చైనా, రష్యాల హితవచనాలకుగాని ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ లొంగడం లేదు. అణ్వాయుధాల తయారీ, మిస్సైళ్ల ప్రయోగాలు ఆపివేయమంటూ యావత్ ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కిమ్ కించిత్ కూడా ఖాతరు చేయడం లేదు. ప్రస్తుతం తన దూకుడును కాస్త తగ్గించినట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం ఉత్తరకొరియా తన ప్రయోగాలు ఆపడం లేదని అన్ని దేశాల అనుమానం. అందుకు తగ్గట్లుగానే ఉత్తరకొరియా చర్యలు కూడా కనిపిస్తున్నాయి.
భీతిల్లిన హాంకాంగ్ విమాన ప్రయాణికులు...
గత ఏడాది నవంబర్ 28న ఉత్తర కొరియా ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అదే సమయంలో ఈ క్షిపణి రేంజ్ లోనే హాంకాంగ్కు చెందిన విమానం ప్రయాణిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన ఈ విమానం హాంకాంగ్ వెళుతోంది. ఫెడరల్ ఏవియేషన్ అధికారుల వివరాల ప్రకారం.. ఈ విమానానికి కేవలం 280 నాటికల్ మైళ్ల దూరంలో ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి కూడా ప్రయాణిస్తోంది. అంతేకాదు, ఆ రోజు అదే దారిలో మరో 9 విమానాలు కూడా వెళుతున్నాయట. ఆ రోజు మొత్తం 716 విమానాలు ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి రేంజ్లోనే ప్రయాణించాయట.
మండిపడిన అమెరికా...
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడంపై అగ్రరాజ్యం అమెరికా మండిపడింది. ఉత్తరకొరియా దుందుడుకుతనానికి, అ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమంటూ యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ తీవ్రంగా మండిపడ్డారు. వాంకోవర్లో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి ప్రయాణిస్తుండడంతో అప్పటికప్పుడు పలు విమానాల మార్గాలను మార్చాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. హాంకాంగ్కు చెందిన విమానం జపాన్ తీర ప్రాంతానికి 155 మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, విమానంలోని ప్రయాణికులు మిస్సైల్ను చూడగానే భయకంపితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చోవలసి వచ్చిందని టిల్లర్సన్ పేర్కొన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వణికిన జపాన్ ప్రజలు...
ఉత్తరకొరియా అణుబాంబు భయం అమెరికా, దక్షిణకొరియా, జపాన్లను ఒక పీడకల మాదిరిగా అనుక్షణం వెంటాడుతూనే ఉంది. ఇటీవల ‘ఉత్తరకొరియా ఒక క్షిపణిని ప్రయోగించింది. అందరూ అప్రమత్తం కండి. భూ గృహాల్లో తలదాచుకోండి..' అంటూ జపాన్ ప్రభుత్వం అత్యవసర ప్రకటన జారీ చేసినట్లు ఓ వెబ్సైట్లో వార్త వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఆ తరువాత 5 నిమిషాలకే ‘వియ్ ఆర్ సారీ' అంటూ ఆ వెబ్సైట్ వివరణ లేకుండా క్షమాపణలు చెప్పడంతో జపాన్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నా.. ఆ వెబ్సైట్పై ఆన్లైన్లో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
ముందు జాగ్రత్తల్లో అమెరికా...
ఉత్తరకొరియా విషయంలో అగ్రరాజ్యం అమెరికా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ క్షణంలో యుద్ధం వచ్చినా అన్నిరకాలుగా ఎదుర్కొనే ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ సన్నాహాల్లో భాగంగానే ఉత్తరకరొలినా రాష్ట్రంలో ఉన్న ఫోర్ట్ బ్రాగ్ ప్రాంతంలో అపాచీ గన్షిప్ హెలికాప్టర్లు, చినూక్ కార్గో హెలికాప్టర్లు తరచూ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు.. నెవాడా గగనతలంలో ఎగురుతున్న విమానాల నుంచి సైనికులు ప్యారాచూట్లతో దూకేస్తున్నారు. అత్యవసర సమయాల్లో మొబిలైజేషన్ సెంటర్లను ఎలా ఏర్పాటు చేయాలో కసరత్తు చేసేందుకు అమెరికాలోని ఆర్మీ రిజర్వు దళాలు సిద్ధమవుతున్నాయి!
ఎలాంటి సైనిక చర్యకైనా సిద్ధంగా...
‘నా దగ్గర అణు మీట ఉంది' అన్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. కొరియన్ ద్వీపకల్పంలో ఎలాంటి సైనిక చర్యకైనా సిద్ధంగా ఉండాలన్న అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ సూచనల మేరకే అమెరికాలోని ఆర్మీ రిజర్వు దళాలు ఈ యుద్ధ సన్నాహక కసరత్తులు చేస్తున్నట్టు పెంటగన్కు చెందిన అధికారులు తెలిపారు. అయితే, మరికొందరు అధికారులు ఇవన్నీ ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా సైనిక సన్నద్ధతను మరింత పటిష్ఠం చేసే క్రమంలో తీసుకునే చర్యలే అని చెబుతున్నారు.