రోజా సస్పెన్షన్: అప్పుడు కరణంపై ఎలా జరిగింది?
హైదరాబాద్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాపై ఏడాది పాటు సస్పెండ్ చేయడంతో గతంలో కరణం బలరాం ఉదంతం తెర మీదికి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్న కరణం బలరాంపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు పడింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై రోజాను అధికార పక్షం తీర్మానం ప్రతిపాదించి, ఆమోదించి ఏడాది పాటు రోజాను శాసనసభ నుంచి సస్పెండ్ చేసింది. రోజాను సస్పెండ్ చేసే విషయంలో చర్చ జరగలేదు. తన వాదనను వినిపించుకునే అవకాశం కూడా రోజాకు ఇవ్వలేదు.
2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై కరణం బలరామమూర్తిని ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే, ఆయన సస్పెండ్ చేయడానికి ఓ పద్ధతిని పాటించారు.

కరణం బలరాం చేసిన వ్యాఖ్యలపై అప్పటి అధికార కాంగ్రెసు పార్టీ సభ్యులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ దాన్ని సభా హక్కుల సంఘానికి నివేదించారు. సీనియర్ సభ్యుడు గాదె వెంకట్ రెడ్డి నేతృత్వంలోని సభా హక్కుల కమిటీ పూర్వపరాలను తెలుసుకుని, అవసరమైన సాక్ష్యాధారాలను పరిశీలించింది.
కరణం బలరాం వాదనలను కూడా కమిటీ విన్నది. ఆ తర్వాత బలరాంను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. దానిపై శాసనసభలో వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కరణం బలరాంకు కల్పించారు. అటువంటి పద్ధతిని పాటించకుండానే రోజాను ఏకంగా అధికార పక్షం తీర్మానంతో సస్పెండ్ చేశారు.
కరణం బలరాం సస్పెన్షన్ను అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. ఇదొక దుర్దినమని, కక్ష సాధింపు చర్య అని ఆయన అన్నారు. సభలో మిగిలిన ప్రతిపక్షాలను కూడగట్టి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా కూడా చేపట్టారు. కరణం బలరాంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారంటూ టిడిపి అప్పట్లో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం కూడా ప్రతిపాదించింది.
కరణం బలరాం ఉదంతాన్ని ప్రస్తావిస్తూ రోజాను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం సరికాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు.












Click it and Unblock the Notifications