తిరుమలలో చిత్రం: భక్తులు తక్కువ, ఆదాయం ఎక్కువ
తిరుపతి: ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చే భక్తులు సంఖ్య తగ్గిపోయింది. అయితే, విచిత్రంగా ఆదాయం మాత్రం పెరుగుతోంది.
గత మంగళవారం రాత్రి నుంచి రూ. 500, 1000 నోట్లు రద్దైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నల్లకుబేరులు తమ వద్ద ఉన్న ధనాన్ని ఏ విధంగా వదిలించుకోవాలని, లేదా తెల్లధనంగా మార్చుకోవాలనే పనిలో ఉన్నారు. కొందరు తమ వద్ద ఉన్న అక్రమ డబ్బును వీధుల్లో పారేస్తుండగా, మరికొందరు తమకు కావాల్సిన వారికి దానం చేస్తున్నారు.

మరికొందరు కమీషన్ ఇచ్చి తెల్లధనంగా మార్చుకునే పనిలో ఉన్నారు. ఇంకొందరు మాత్రం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని దేవుడికే అప్పగించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది.
సామాన్యులు చిల్లరతో ఇబ్బందులు పడుతూ తిరుమలకు చేరుకోకపోవడంతో దేవస్థానంలో భక్తుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. అయితే, వచ్చిన నల్ల(ధనం)భక్తులు మాత్రం భారీగా డబ్బు తెచ్చి శ్రీవారి హుండీలో వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తమ వద్ద ఉన్న నల్లధనం దూరమవడంతోపాటు కాసింత పుణ్యం వస్తుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, భక్తులు తక్కువగా ఉన్నా.. ఆదాయం మాత్రం భారీగా వస్తుండటంతో టిటిడి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. హుండీల్లో రూ. 500, 1000 నోట్లు భారీ సంఖ్యలో వచ్చి పడుతున్నామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications