కడప నుండే దూకుడు తగ్గించి: వైఎస్ బాటలో జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తీరును మార్చుకొని తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. జగన్ది స్వతహాగా దూకుడు ధోరణి అనే వాదన ఉంది. అయితే ఇటీవల ఆయన తన ధోరణిని మార్చుకున్నారని అంటున్నారు. తన ధోరణి నుండి బయటపడి అందరికీ దగ్గరయ్యే దిశలో వెళ్తున్నారని అంటున్నారు.
అదే సమయంలో 2009 ఎన్నికలకు ముందు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అవలంభించిన ఆపరేషన్ ఆకర్ష్ విధానాన్ని జగన్ అందిపుచ్చుకున్నారంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాల్లో పార్టీ పట్టును మరింత బిగించే పనిలో జగన్ నిమగ్నమయ్యారు. సీమాంధ్ర జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగా నిలదొక్కుకుంది. దీంతో ఆకర్ష్ పథకాన్ని జగన్ తన సొంత ఇలాకా కడప జిల్లా నుంచే అమలు చేయాలని భావిస్తున్నారట.
జిల్లాకు చెందిన పలువురు నేతలతో పాటు రాజకీయంగా తన కుటుంబాన్ని బద్ద శతృవుగా భావించే కందుల సోదరులను అనూహ్యమైన రీతిలో మిత్రులుగా మలుచుకున్నారంటున్నారు. టిడిపికి పెద్ద దిక్కుగా మారిన మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి, కందుల రాజమోహన్ రెడ్డి వారి బంధువైన మాజీ మంత్రి రామముని రెడ్డిలను అనుకూలంగా మార్చుకున్నారు. వైయస్ హయాంలో కాంగ్రెస్లో చేరిన వారంతా ఆయన మరణం తరువాత కూడా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.
ప్రస్తుతం కందుల సోదరులు తన తల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇంటగెలిచి రచ్చ గెలవాలనే భావనతో జగన్ కందుల సోదరులతోనే ఆకర్ష్ పథకం అమలుకు రంగం సిద్ధం చేశారట. అధినేత ఆలోచనలకు అనుగుణంగానే ఆ పార్టీ నేతలు కూడా అడుగులు వేస్తున్నారంటున్నారు. ఇటీవల వేంపల్లెలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలతో పార్టీ జెండాలు చేత పట్టుకొని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి ఇంటి సమీపంలో వెళ్లారు. ఆయనతో తమ పార్టీ జెండా పట్టించి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేయించారు.
మరోవైపు జగన్ చొరవతో జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరారు. జగన్ నియోజకవర్గాల వారీగా ఇటు కాంగ్రెస్ అటు తెలుగుదేశం పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట. తన ధోరణి వీడి తండ్రి దారిలో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా సొంత జిల్లాతో పాటు మిగిలిన జిల్లాల్లోను బలమైన నేతలను చేర్చుకోవడం ద్వారా పార్టీ పునాదులు మరింత గట్టిగా తయారు చేసే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారట.