'టి - ఆర్టికల్ 3: విభజనకు దారి చూపిందే జగన్'
విభజనకు దారి చూపిందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు న్యూఢిల్లీలో శనివారం మాట్లాడుతూ.. జగన్ విభజనకు దారి చూపారని ఆరోపించారు.
విభజనకు ఆర్టికల్ 3 ఉందని జగన్ పార్టీయే కేంద్రానికి గుర్తు చేసిందన్నారు. అఖిల పక్షంలోను ఆర్టికల్ 3 ఉపయోగించినా అభ్యంతరం లేదని చెప్పి ఇప్పుడు ఏమీ ఎరగనట్లు చిలుకపలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. విభజనకు ఆర్టికల్ 3ను ఉపయోగించాలని జగన్ చెప్పారని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు కూడా రెండు రోజుల క్రితం ఆరోపించారు. ఇదే విమర్శను తెలుగుదేశం పార్టీ కూడా చేసింది.
విభజనపై ముందుకెళ్లేందుకు అధిష్టానం నిర్ణయించుకున్న సమయంలో సీమాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, దీంతో సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అధిష్టానాన్ని నిలదీశారు, అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో అధిష్టానం ఆర్టికల్ 3 ప్రకారం విభజించాలని నిర్ణయం తీసుకుందని, తద్వారా అసెంబ్లీకి తీర్మానం రాదని, ఇది జగన్ చూపించిన దారేనని పలువురు విమర్శిస్తున్నారు.
జగన్ పదహారు నెలలు జైల్లో ఉండి కూడా విభజన ఇంతగా బాధపడలేదని చెప్పడం ద్వారా జైల్లో షటిల్ ఆడుతూ సంతోషంగా గడిపినట్లు ఒప్పుకున్నారని, జైల్లో ఉన్నప్పుడు చేసిన ఆరు రోజుల దీక్షలో యాభై అరవై టీషర్టులు మార్చిన జగన్ ఇప్పుడు లోటస్ పాండులోని అదే తరహా దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో ఉన్న భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడానికే జగన్, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షలు అంటున్నారని మండిపడ్డారు.