కెసిఆర్ వ్యూహం: కవిత వర్సెస్ విజయశాంతి?
హైదరాబాద్: మెదక్ లోకసభ స్థానం విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. మెదక్ లోకసభ స్థానంలో ఇద్దరు మహిళల పోరాటానికి ఆయన తెర తీస్తున్నట్లు సమాచారం. తనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన మెదక్ లోకసభ స్థానం నుంచి తన కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోటీకి దించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. దాంతో విజయశాంతికి, కల్వకుంట్ల కవితకు మధ్య హోరాహోరీ పోరు సాగనుంది.
నిజానికి, కవిత నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ విషయాన్ని ఆమె బహిరంగంగా ప్రకటించారు కూడా. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో తన వారసురాలిగా మెదక్ లోకసభ స్థానానికి కవితను తీసుకురావాలని ఆయన అనుకున్నట్లు చెబుతున్నారు.
శుక్రవారంనాడు ఆయన 69 మందితో శానససభకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కెసిఆర్ మెదక్ జిల్లా గజ్వెల్ నుంచి పోటీ చేయనున్నారు. కెసిఆర్ కరీంనగర్ లోకసభ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
విజయశాంతి తెరాస నుంచి బహిష్కరణకు గురై కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆమె మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఇప్పటి వరకు అనుకుంటూ వస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానం మెదక్ నుంచి సిట్టింగ్ ఎంపి విజయశాంతినే రంగంలోకి దింపాలని ఆలోచిస్తోంది. మెదక్లో ఎవరు పోటీ చేసినా తాను గెలుస్తానని, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని విజయశాంతి అంటున్నారు.