మీడియాపై కెసిఆర్ 'పరువు" కొరడా (పిక్చర్స్)
హైదరాబాద్: మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గుర్రుగానే ఉన్నట్లున్నారు. తమకు వ్యతిరేకంగా వచ్చే వార్తాకథనాలను ఎట్టి పరిస్థితిలో కూడా సహించకూడదనే పద్దతిలో ఆయన వ్యవహరిస్తున్నారు. మంత్రులకు ఆయన ఇచ్చిన సూచనలు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు ఇప్పటికే ఆయన ఆగ్రహాన్ని చవి చూశాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన చేసిన సూచనలు ఆ కఠిన వైఖరి ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పాయి.
ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా వార్తలు వస్తే ఆయా మీడియా సంస్థలపై పరువునష్టం కేసులు వేయాలని ఆయన మంత్రులకు సూచించారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందంటూ, మంత్రులూ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తే సహించవద్దని చెప్పారు.
శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా ఏడు గంటలపాటు ఈ భేటీ సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరగటం ఇది రెండవసారి. గత ఏడాది 43 నిర్ణయాలు తీసుకున్న తొలి కేబినెట్ భేటీ కూడా సుదీర్ఘంగానే సాగింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో శుక్రవారం నాటి కేబినెట్ సమావేశం జరగటం విశేషం.

కొన్ని అంశాలు వదిలేశారు..
మంత్రి వర్గ సమావేశ అజెండాలో 17 అంశాలు ఉన్నాయి. అయితే సమయాభావం వల్ల అన్నింటిపైనా పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. ప్రధానంగా మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలు, ఫాస్ట్ పథకంపైనే ఎక్కువ సమయం చర్చ జరిగింది.

ప్రతి దాన్నీ ఉపేక్షించవద్దు..
బాధ్యతల్లో ఉన్నంత మాత్రాన జరిగే తప్పులన్నింటికీ బాధ్యులను చేస్తే ఊరుకోవద్దని కెసిఆర్ మంత్రులకు చెప్పారు.

అది తప్పా...
బాధ్యతల్లో ఉండటమే తప్పా ? మంత్రులు మాత్రం వ్యక్తిగతంగా, పరిపాలనాపరంగా తప్పులు చేయవద్దని, తప్పు చేయకపోతే భయపడొద్దని కెసిఆర్ చెప్పారు.

ప్రోత్సహించవద్దు..
మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని, ప్రోత్సహించవద్దని, దీటుగా బదులివ్వాలని, ఆ వార్తలను ప్రచురించే, ప్రసారం చేసే మీడియా సంస్థలపై కేసులు వేయాలని ఆదేశించారు.

మంత్రుల తీరుపై అసంతృప్తి
మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తంచేస్తూనే, కొత్తగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరిసహా అందరూ ఇక నుంచి పనిపై పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. మంత్రులందరూ సమన్వయంతో పని చేయాలని నిర్దేశించారు.

క్షేత్ర స్థాయిలో కలుపుకుని వెళ్లాలి..
క్షేత్రస్థాయిలో వివిధ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పారు.

371డి ప్రామాణికం..
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు విషయంలో స్థానికత విషయంలో ఏపీ ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోనూ 371 డి ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్ల విద్యాభ్యాసంలో నాలుగేళ్లు ఇక్కడ చదివి ఉండాలని, అప్పుడే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.

చర్చకు రాని రాజయ్య బర్తరఫ్
మాత, శిశు సంరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలు, వసతి గృహాల్లో వసతుల మెరుగు, మెనూ మార్పు, కాస్మోటిక్ చార్జీల పెంపుపైనా కొంత చర్చ జరిగింది. ఇదిలా ఉంటే.. కేబినెట్ నుంచి డిప్యూటీ సీఎం రాజయ్య బర్తరఫ్ వ్యవహారం శుక్రవారం నాటి సమావేశంలో చర్చకు రాలేదని తెలిసింది.

మీడియా సమావేశంలో కెసిఆర్
సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత కెసిఆర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన చాలా క్లుప్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications