మోడీ బాటలో.. ఇక కేసీఆర్ ‘మన్ కీ బాత్’!:సంచలనమే అవుతుందా?
దేశ ప్రజలతో సంభాషించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా మన్ కీ బాత్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా మోడీ బాటలో నడిచేందుకు
హైదరాబాద్: దేశ ప్రజలతో సంభాషించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా మన్ కీ బాత్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా మోడీ బాటలో నడిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకునేందుకు, తన మనసులోని భావాలను జనంతో పంచుకునేందుకు కేసీఆర్ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సభల కంటే మిన్న..
భారీ బహిరంగ సభల కంటే ఎంపిక చేసిన వర్గాలతో ముఖాముఖి మాట్లాడటం ద్వారానే ప్రభుత్వ పనితీరును ప్రజలకు బాగా వివరించవచ్చని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ దిశగా ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అధికార పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం మేరకు 'ఈ-క్యాంపెయిన్' ద్వారా ఎక్కువ మంది ప్రజలను చేరుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

మోడీ మాదిరిగానే..
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఈ వ్యూహం సత్ఫలితాలిచ్చిందని భావిస్తున్న సీఎం.. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను పురమాయించారని తెలుస్తోంది. దేశ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ 'మన్కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్లుగానే.. ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారని చెబుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సీఎం కార్యాలయ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్లో ప్రత్యేక స్టూడియో ఏర్పాటు చేస్తున్నారని, ఆ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిసింది.

ప్రగతిభవన్ నుంచే నేరుగా..
ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రధానంగా వివరించనున్నారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా.. నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోనున్నారని చెబుతున్నారు. ఇకపై ప్రగతి భవన్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ప్రజలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఆశ వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు వంటి వారితో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నేరుగా మాట్లాడబోతున్నారు. ముందుగానే ఎంపిక చేసిన జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో వివిధ వర్గాలవారిని సమీకరిస్తారు. హైదరాబాద్ నుంచి సీఎం నేరుగా ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా లైవ్లో వారినుద్దేశించి ప్రసంగిస్తారు.

ప్రజలకు మాట్లాడే అవకాశం..
ప్రజలు కూడా లైవ్లో సీఎంతో మాట్లాడడంతో పాటు వారి సమస్యలను చెప్పుకునే వీలుంటుంది. ప్రజాసమస్యలపై సీఎం వెంటనే స్పందించి అవసరమైన చర్యలకు సంబంధిత అధికారులను అక్కడిక్కడే ఆదేశిస్తారని చెబుతున్నారు. ఇలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక జిల్లాలోని ప్రజలతో సీఎం ముఖాముఖి ఉంటుందందని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ప్రజలు సీఎం ప్రసంగాన్ని చూసేలా భారీ స్థాయిలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే యాదవులు, మత్స్యకారులు, రైతులు ఇలా పలు వర్గాలతో ప్రగతిభవన్లోనే సమావేశాలు జరిపారు. దీనికంటే 'ఈ-పబ్లిసిటీ'ద్వారా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ప్రభుత్వ పథకాల ప్రచారం
గత మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర పథకాలపై ఐదు నుంచి పది నిమిషాల నిడివిగల లఘు చిత్రాలను కూడా స్క్రీన్లపై ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ నేరుగా ప్రజలతో మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వం దగ్గరవుతుందని అధికార పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కసరత్తులు మొదలైనట్లు తెలుస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications