సిఎం ధీమా: కేంద్రమంత్రుల ఘాటు సంకేతాలు
ఎట్టి పరిస్థితుల్లోను విభజన జరగదనే ధీమాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధీమాగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరు కలిసినా కిరణ్ మాత్రం విభజనపై అధిష్టానం ముందుకు వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారట. శనివారం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు.
ఈ సమయంలో కిరణ్ వారితో విభజనతో వచ్చే సమస్యలను పరిష్కరించడం అసాధ్యమని, దీని ఫలితంగానే విభజన జరిగే పరిస్థితి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. కేబినెట్ నోట్ తయారైతే రాజీనామాలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని ఎంపీలు ఆయనకు చెప్పారు. కిరణ్ మాత్రం.. రాజీనామా చేయడం కన్నా బిల్లు శాసన సభ, పార్లమెంటులో చర్చ వరకు వస్తే వ్యతిరేకించాలని సూచించారట.
విభజనపై అధిష్టానం ముందుకు వెళితే పార్టీకి గుడ్ బై చెప్పి, రాష్ట్ర సమైక్యత కోసం జనంలోకి వెళ్దామని పలువురు ఆయన ముందు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. దానికి కిరణ్ మాత్రం అలాంటి పరిస్థితి రాదని, ప్రస్తుత పరిస్థితుల్లో అధిష్టానం విభజనపై ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లదని చెప్పారట. అనుకోని విధంగా కేబినెట్ సమావేశం ముందుకు నోట్ వస్తే మాత్రం దానిపై తమ అసమ్మతి తెలిపేందుకు వీలుగా పదవుల్లో కొనసాగాలని సూచించారు.
విభజనపై అధిష్టానం ముందుకు వెళ్తే మాత్రం రాజీనామాలు చేయాలని, ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలకు చెప్పాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు నిర్ణయించుకున్నారు. అవసరమైతే పార్టీని వదిలేందుకు కూడా సిద్ధమనే సంకేతాలు అధిష్టానానికి పంపించాలని చూస్తున్నారు.